సమస్యల పరిష్కార వేదికగా రైతువేదిక
అన్ని వసతులతో వైకుంఠధామం
పల్లెకు ఆకర్షణగా ప్రకృతి వనం
కల్లూరు, జూలై 25 : ‘పల్లె ప్రగతి’ బత్తులపల్లి దశను మార్చింది.. వెనుకబాటులో ఉన్న పల్లెను అభివృద్ధి బాట పట్టించింది.. మౌలిక వసతులు లేక ఇబ్బంది పడిన గ్రామస్తులకు అన్ని వసతులు కల్పించింది.. ఇప్పుడు ఆ గ్రామం ‘హరిత’వనాన్ని తలపిస్తున్నది.. అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. రైతువేదిక రైతు సమస్యల పరిష్కార వేదికగా మారింది.. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుని పంచాయతీ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.. ఈ నేపథ్యంలో అభివృద్ధి జరిగిన తీరుపై కథనం..
ఒకప్పుడు వెనుకబాటులో ఉన్న కల్లూరు మండలంలోని బత్తులపల్లి గ్రామం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టింది.. కనీస వసతులు లేని గ్రామస్తులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. చెరువు గట్లు, మడికట్లపై కూర్చుని సాగుపై చర్చించుకున్న రైతులు ఇప్పుడు రైతువేదికలో సంఘటితమవుతున్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. దీంతో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసి పాలకవర్గం అభివృద్ధి సాధించింది. ఈ పల్లె ‘ప్రగతి’గాథపై ప్రత్యేక కథనం..
జరిగిన అభివృద్ధి ఇదీ..
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. వనంలో మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో ఉదయం, సాయంత్రం గ్రామస్తులు ఇక్కడ వ్యాయామం చేస్తున్నారు. సర్పంచ్ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది వనంలోని మొక్కలను సంరక్షిస్తున్నారు. ఇప్పుడు వనం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నది. పంచాయతీ సిబ్బంది యార్డులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. రోజు విడిచి రోజు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. దీంతో గ్రామానికి సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి.
కంపచెట్లు, ముళ్లపొదలతో నిండి ఉన్న ప్రాంతంలో ఇప్పుడు వైకుంఠధామం ఏర్పాటైంది. గతంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలకు ఇబ్బంది పడిన గ్రామస్తులు ఇప్పుడు గౌరవప్రదంగా మృతులను ఆఖరి మజిలీకి తీసుకువస్తున్నారు. వైకుంఠ ధామంలో మొక్కలు పెంచుతుండడంతో వనాన్ని తలపిస్తున్నది. గ్రామంలో నిర్మించిన రైతువేదిక రైతు సమస్యల పరిష్కార వేదికగా మారింది. వ్యవసాయశాఖ అధికారులు ఇక్కడ రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారు. రైతులందరూ ఒకేచోట సంఘటితమై సాగుపై చర్చిస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతో..
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు గ్రామస్తులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాం. సమష్టిగా పనిచేయడం వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమైంది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, రైతువేదిక, డంపింగ్యార్డుతో పాటు గ్రామంలో నాటిన మొక్కలతో గ్రామం కళకళలాడుతున్నది.
– శీలం సత్యనారాయణరెడ్డి, సర్పంచ్, బత్తులపల్లి