మణుగూరు రూరల్, జూలై 25: పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. టీఆర్ఎస్ మణుగూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు హర్షనాయుడు అధ్యక్షతన పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో యువజన విభాగాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో చర్చిస్తానని అన్నారు. ఐటీసీ, బీటీపీఎస్, సింగరేణి సంస్థల్లో ఉపాధి అవకాశాలను స్థానిక యువతకే కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలో వేలాది ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోందని, నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.