పేదల ఆత్మగౌరవం కోసమే వారికి పక్కా ఇండ్లు
ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమం ఆగలేదు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్
విశ్వనాథపల్లి, తవిసిబోడులో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం
కారేపల్లి రూరల్, జూన్ 23: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. అసలు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇచ్చిన చరిత్ర దేశంలో మరెక్కడా లేదని గుర్తుచేశారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి పంచాయతీ తవిసిబోడు, విశ్వనాథపల్లి గ్రామాల్లో 44 డబుల్ బెడ్ రూం ఇళ్లను వైరా ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి మంత్రి పువ్వాడ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు కట్టించిన ఇళ్లను కాగితాల్లోనూ, ఖర్చు చేసిన లెక్కల్లోనూ చూపేవని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి వారి కళ్లలో సంతోషం చూస్తోందని అన్నారు. వచ్చే నెల 1 నుంచి 10 వరకు నిర్వహించనున్న పల్లెప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కారేపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ పేదలు గౌరవంగా బతకాలని ఆలోచించి వారికి ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్ స్నేహలత, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ శకుంతల, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ జగన్, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు నాగేశ్వరరావు, తోటకూరి పిచ్చయ్య, అజ్మీరా వీరన్న, ముత్యాల వెంకటప్పారావు, పెద్దబోయిన ఉమాశంకర్ పాల్గొన్నారు.
తిలకం దిద్ది.. హారతులిచ్చి..
డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి గృహ ప్రవేశాలు చేయించిన సందర్భంగా మంత్రి అజయ్కు లబ్ధిదారులు తిలకం దిద్ది హారతులిచ్చారు. తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు మంత్రి అజయ్ స్వీటు తినిపించారు.