భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల/ సారపాక/ చర్ల, అక్టోబర్ 22: ఎవరూ ఆకలితో అలమటించకూడదనేదే తమ కమిటీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార భద్రత చట్టం కమిటీ చైర్మన్ తిరుమలరెడ్డి అన్నారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో తన బృందంతో కలిసి శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత దుమ్ముగూడెం మండలం నర్సాపురం జడ్పీ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, ఆహార సరఫరా గురించి ఆరాతీశారు. అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పోషకాహారం వివరాలను తెలుసుకున్నారు. ఓ చిన్నారిని ఎత్తుకుని బరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఆహార కమిటీ పనిచేస్తోందని, మారుమూల గిరిజనులకు ఆహార సరఫరా జరుగుతుందా? లేదా? అని తెలుసుకునేందుకు జిల్లాకు పర్యటనకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని వివరించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆహార కమిటీ బృందం సభ్యులతోపాటు డీఎంహెచ్వో శిరీష, డీఈవో సోమశేఖరశర్మ, డీఆర్డీవో మధుసూదన్రాజు పాల్గొన్నారు. అనంతరం చర్ల మండలంలోని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను కూడా సందర్శించారు. పర్ణశాలలోని శ్రీసీతారామచంద్రస్వామిని కూడా చైర్మన్ తిరుమలరెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఐటీసీ పీఎస్పీడీలో బస చేసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాచలంలోని జీసీసీ కార్యాలయం ఆవరణలో షాంపూలు, సబ్బుల తయారీ కేంద్రాన్ని, ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.