ట్యూబ్లైట్ల స్థానంలో ‘ఎల్ఈడీ’తో విద్యుత్ చార్జీల మోతకు చెక్
భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నెలకు రూ.7.5 లక్షల ఆదా
ప్రతి పట్టణంలోనూ కాంతి ఉద్గార వెలుగులు
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 22 : గతంలో మున్సిపాలిటీల్లోని వీధులు, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన ట్యూబ్లైట్లతో విద్యుత్ చార్జీల మోత మోగేది. ఈ బిల్లులు మున్సిపాలిటీలకు భారంగా మారేవి. నెలనెలా బిల్లుల చెల్లింపులకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి వచ్చేది. అంతేకాదు, బిల్లులు చెల్లించని మున్సిపాలిటీలకు కరెంట్ కట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఆదా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ట్యూబ్లైట్ల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చేందుకు ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఈ సంస్థ ఎల్ఈడీ లైట్లను అమర్చి వెలుగులు పంచుతున్నది. ప్రస్తుతం ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ చార్జీల భారం 30 శాతం తగ్గింది.
అద్భుతమైన కాంతినిచ్చే లైట్ ఎమిట్టింగ్ డయోడ్ (ఎల్ఈడీ) బల్బులు.. చార్జీల భారాన్ని నామమాత్రం చేస్తున్నాయి. వీధులు, ప్రధాన రహదారుల్లో గతంలో ఏర్పాటు చేసిన ట్యూబ్లైట్లతో కరెంట్ చార్జీల మోతమోగేది. ఈ బిల్లుల చెల్లింపులు ప్రధానంగా మున్సిపాలిటీలకు భారంగా మారేవి. నెలనెలా ఈ బిల్లుల చెల్లింపులకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన దుస్థితి నెలకొనేది. గతంలో సకాలంలో బిల్లులు చెల్లించని సమయంలో మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన సందర్భాలు అనేకం. రాష్ట్రం ఆవిర్భావించాక మున్సిపాలిటీల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే క్రమంలో తొలుత ప్రజలకు వసతుల కల్పనతో పాటు కార్యాలయాలకు అవనసరమైన వాటిని తగ్గించి నిధులను ఇతరత్రా అభివృద్ధి పనులకు కేటాయించాలనే ఆలోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే తొలుత విద్యుత్ బిల్లుల చెల్లింపులపై దృష్టి సారింది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ ప్రతి నెలా రూ.లక్షల్లో కరెంట్ బిల్లులను చెల్లిస్తుంటుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం దానికి గల కారణాలను అన్వేషించి విద్యుత్ను ఆదా చేసే పనిలో పడింది. వీధుల్లో వెలిగే ట్యూబ్లైట్లు, ఇతర హైమాస్ట్ స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడం వల్ల కొంత ఆదా చేయవచ్చని గ్రహించింది.
ఎల్ఈడీతో చార్జీల మోతకు చెక్
మున్సిపాలిటీలో ట్యూబ్లైట్ల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీకి ఈ సంస్థ ఎల్ఈడీ లైట్లను అమర్చి వెలుగులను పంచుతోంది. 2017 ఆగస్టులో ప్రారంభమైన ఈ బల్బుల అమరిక.. అతి తక్కువ కాలంలోనే అన్ని వార్డుల్లోనూ పూర్తయింది. ప్రస్తుతం ఎల్ఈడీ బల్బులతో కరెంట్ చార్జీల చెల్లింపులు 30 శాతం తగ్గాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులకు కలిపి 4700 ఎల్ఈడీ లైట్లను అమర్చారు. గతంలో ప్రతి నెలా రూ.5.20 లక్షల కరెంట్ బిల్లులు రాగా ప్రస్తుతం రూ.4 లక్షల బిల్లు వస్తుంది. ఫలితంగా ప్రతి నెలా రూ.1.20 లక్షల భారం తగ్గింది. ఇక పాల్వంచ మున్సిపాలిటీలో 5 వేల ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ప్రతి నెలా సుమారు రూ.5 లక్షల బిల్లు రాగా ప్రస్తుతం రూ.3 లక్షల నుంచి 4 లక్షల మధ్య బిల్లులు చెల్లిస్తున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 2వేల ఎల్ఈడీలను అ మర్చారు. గతంలో రూ.6 లక్షలకు పైగానే బిల్లులు చెల్లింపులు జరపగా ప్రస్తుతం రూ. 4లక్షలకు పైగానే బిల్లుల చెల్లింపులు జరుపుతున్నారు. ఇక మణుగూరు మున్సిపాలిటీలలో 3 వేల ఎల్ఈడీ బల్బులను అమర్చగా రూ.4 లక్షలకు పైగానే బిల్లులు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు బిల్లులు చెల్లిస్తున్నారు.
ప్రతీ పట్టణంలో ఎల్ఈడీ వెలుగులు
జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులు, ప్రధాన సెంటర్లలో ఎల్ఈడీ బల్బులు కాంతులు వెదజల్లుతున్నాయి. గతంలో ట్యూబ్లైట్ల అరకొర వెలుతురు నడుమ రాకపోకలు సాగించేందుకు వార్డుల ప్రజలు, పాదాచారులు, వాహనదారులు అనేక ఇబ్బందులుపడేవారు. ప్రభుత్వం ఎల్ఈడీలను ఏర్పాటు చేయడంతో కాంతి ఉద్గార వెలుగుల్లో రోడ్లు, వార్డులు మెరుస్తున్నాయి. వీధుల్లో ఏర్పాటు చేసే ఎల్ఈడీ లైట్ల మరమ్మతులను ఈఈఎస్ఎల్ సిబ్బంది సకాలంలో చేస్తున్నారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన స్తంభాలకు వార్డు నెంబర్, స్తంభం నెంబర్ను వేశారు. ఏదైనా బల్బు వెలగకపోతే తక్షణం సంబంధిత మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే ఈఈఎస్ఎల్ సిబ్బంది చేరుకొని మరమ్మతులు చేసి లైట్ వేలిగేలా చేస్తున్నారు.
చార్జీల చెల్లింపులతో ఉపశమనం..
మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులోనూ ఎల్ఈడీ లైట్లను అమర్చాం. గతంలో ట్యూబ్ లైట్ల ఏర్పాటుతో కరెంట్ బిల్లుల చెల్లింపులు తలకు మించిన భారంగా ఉండేది. ప్రస్తుతం ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో కొంత ఉపశమనం కలుగుతోంది. ఎల్ఈడీ లైట్ల అమరికతో ప్రతి నెలా రూ.లక్ష పైగా ఆదా అవుతుంది.
-అరిగెల సంపత్కుమార్, మున్సిపల్ కమిషనర్