అబ్బబ్బా.. ఇది ఏమి వాన..
రెండు రోజులుగా ఎడతెగని జల్లులు
పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
నిండుకుండలను తలపిస్తున్న రిజర్వాయర్లు
ప్రాణం పోసుకుంటున్న పత్తి, పునాస పంటలు
సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు
కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం, జూలై 22: ఎడతెగని వర్షం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం సమీపంలోని మున్నేరు ఒక్కసారిగా పరవళ్లు తొక్కింది. పాలేరు, వైరా, లంకాసాగర్, కిన్నెరసాని, పెద్దవాగు రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. బేతుపల్లి పెద్దచెరువు అలుగుపోసింది. తల్లాడ మండలంలోని నూతనకల్ – గూడూరు మధ్యన గల బ్రిడ్జిపై వరదనీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం – కేజీ సిరిపురం, రఘునాథపాలెం మండలం పాపటపల్లి వీఆర్ బంజర మధ్య కూడా వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి.
జలాశయాల్లోకి వరద నీరు..
ఉమ్మడి జిల్లాలోని జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగభూపాలెం చెరువు, కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నాయి. గొందిగూడెం ఇసుక వాగు, జూలూరుపాడు పెద్దవాగు, ఇల్లెందు మసివాగు పొంగి ప్రవహిస్తున్నాయి. మూకమామిడి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరింది. కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తడంతో 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రగళ్లపల్లి – సున్నంబట్టి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుజాతనగర్ – రాఘవాపురం మార్గంలో బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన తాత్కాలికం రహదారి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచి
పోయాయి.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి బొగ్గు గనుల్లోకి భారీగా వర్షపునీరు చేరడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం ఏరియా జీకేవోసీ, జేవీఆర్వోసీ, మణుగూరు, ఇల్లెందు ఏరియా ఓపెన్ కాస్ట్ గనుల్లో రెండు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యార్డు కోల్ను అధికారులు రవాణా చేస్తున్నారు.
ఖమ్మంలో ప్రత్యేక కాల్ సెంటర్
మామిళ్లగూడెం: వర్షం కురుస్తున్నందున ప్రజలకు అవసరమైన సహాయక చర్యల కోసం ఖమ్మం కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే సత్వరమే 1077 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.
కొత్తగూడెంలో కంట్రోల్ రూం
ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున సత్వర సాయం కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్లు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
వర్షం నేపథ్యంలో ఎలాంటి సాయం అవసరమైనా 08744-241950 నంబరుకు ప్రజలు ఫోన్ చేయాలని సూచించారు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లొద్దని సూచించారు.
కిన్నెరసాని రెండు గేట్ల ఎత్తివేత
పాల్వంచ రూరల్: కిన్నెరసానిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో గురువారం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మధ్యాహ్నం గేట్లను మూసివేశారు. రాత్రి ఇన్ఫ్లో 8వేల క్యూసెక్కులు ఉండడంతో 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. గురువారం సాయంత్రం 402 అడుగులుగా ఉంది.
పాలేరుకు 2,000 క్యూసెక్కులు
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్కు 2,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. మూడు రోజుల క్రితం 13 అడుగులుగా ఉన్న నీటిమట్టం గురువారం 15.8 అడుగులకు చేరుకుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు.
20 అడుగులకు ‘వైరా’ నీటిమట్టం
వైరా: వైరా రిజర్వాయర్ నీటిమట్టం 20 అడుగులకు చేరుకుంది. దీంతో అలుగుల ద్వారా వరదనీరు పొంగిపొర్లుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.03 అడుగులు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఆ నీటిమట్టం 20 అడుగులకు చేరుకుంది. దీంతో అలుగుల ద్వారా వరదనీరు బయటకు ప్రవహిస్తోంది.