అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
స్లాట్ బుక్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం
రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో భారీగా పెరుగుదల
రూ.1.70 కోట్ల ఆదాయం
ఖమ్మం, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను అన్లాక్ చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఈ నెల 20 వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, వివాహ రిజిస్ట్రేషన్లు, ఇతర రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలన్న నిబంధన అమలులో ఉండేది. దాదాపు 40 రోజుల లాక్డౌన్ కారణంగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ఆయా వర్గాల ప్రజలు పడిన ఇబ్బందిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారు స్లాట్ బుక్ చేసుకోకపోయినా నేరుగా అదేరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ పని ముగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈనెల 21 నుంచి ఈ వెసులుబాటు కలగడంతో ఉమ్మడి జిల్లాలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముమ్మరమైంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, ఖమ్మం రూరల్, కూసుమంచి, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మధిర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. స్లాట్ బుక్ చేసుకోనివారు నేరుగా ఆ కార్యాలయాల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకున్నారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 36 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఖమ్మం, కూసుమంచి, ఖమ్మం రూరల్ కార్యాలయాల్లో నిర్ణీత స్లాట్లు రోజువారీగా బుక్ అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండటంతో 72 మంది ఒకేరోజు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసే అవకాశం కలుగుతోంది.
ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు కారణంగా జిల్లా కేంద్రమైన ఖమ్మంలో స్లాట్ బుక్ చేసుకోకుండా నేరుగా 10 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 రిజిస్ట్రేషన్లు స్లాట్ లేకుండా నేరుగా అయ్యాయి. భద్రాద్రి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో మాత్రం వేగంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 291 రిజిస్ట్రేషన్లు కాగా ఇందులో ఇల్లెందు, భద్రాచలంలో సోమ, మంగళవారాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. బూర్గంపహాడ్లో మాత్రం మంగళవారం నాలుగు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కొత్తగూడెంలో సోమవారం 41, మంగళవారం 9 జరిగాయి. ఇక ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్లో సోమవారం 39, మంగళవారం 53 రిజిస్ట్రేషన్లు, మధిరలో సోమ, మంగళవారాలు కలిపి 46 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైరాలోనూ 27, కూసుమంచిలో 87, కల్లూరులో 7, ఖమ్మంలో 106 రిజిస్ట్రేషన్లు సోమ, మంగళవారాల్లో పూర్తయ్యాయి. అలాగే రెండు రోజుల్లో స్టాంపుల విక్రయం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు సుమారు రూ.6 లక్షల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ రుసుము కింద దాదాపు రూ.1.70 కోట్లు ఆదాయం వచ్చింది. స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లభించడంతో రిజిస్ట్రేషన్దారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం సమాయత్తమవుతున్నారు.
సజావుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..
స్లాట్ బుక్ చేయకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి సైతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాం. ఖమ్మంలో మంగళవారం ఈ తరహాలో 10 రిజిస్ట్రేషన్లు చేశాం. అయితే స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయడంలో తొలి ప్రాధానం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగానే ప్రక్రియ పూర్తిచేస్తున్నాం.
-రవీందర్, జాయింట్ రిజిస్ట్రార్, ఖమ్మం