కొత్తగూడెం, అక్టోబర్ 21: ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కేంద్రాలను శానిటైజ్ చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయాలన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 34 కేంద్రాలను పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. రూట్ మ్యాపుల ఆధారంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 24 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34 మంది డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో ఫ్లయింగ్ స్కాడ్స్, మూడు సిట్టింగ్స్ స్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి, డీపీవో రమాకాంత్, విద్యుత్శాఖ ఎస్ఈ సురేందర్, ఆర్టీసీ డీవీఎం శ్రీకృష్ణ, సీఐ బాలాజీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.