మామిళ్లగూడెం, అక్టోబర్ 21: శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రాణాలను ఫణంగా పెట్టి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా గురువారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్మృతి పరేడ్కు సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి హాజరై మాట్లాడారు. పోలీసులు నిబద్ధతతో విధులు నిర్వర్తించడంతోనే ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. మనిషిగా పుట్టిన ఏ ఒక్కరూ ప్రాణం త్యాగం చేయరని, పోలీసులు మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంత జిల్లా అయిన ఖమ్మంలో పోలీసులు రేయింబవళ్లు పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో సైబర్ క్రైం, డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. కొవిడ్ వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పోలీస్శాఖ ‘మేమున్నాం..’ అంటూ కరోనా కట్టడి కోసం పనిచేశారన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సుకు పోలీసులు అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. పోలీసులకు కొవిడ్ అనే చాలెంజ్ ఎదురైందని, కొవిడ్ కాలంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పని చేశారన్నారు. కొందరు ప్రాణాలు సైతం విడిచారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ నీరజ, డీసీపీ ఇంజారపు పూజ, డీసీపీ ఎల్సీ నాయక్, అడిషనల్ డీసీపీ (లాఅండ్అర్డర్) సుభాశ్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ ప్రసాద్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమరాస్వామి, ఏఎస్పీ స్నేహమేహ్రా, ఏఆర్ ఏసీపీ విజయ్బాబు, ఏసీపీలు రామోజీ రమేశ్, అంజనేయులు, వెంకటేశ్, ప్రసన్నకుమార్, జహింగీర్, ఏవో అక్తరున్నీసా బేగం, పలువురు సీఐలు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులతో భేటీ..
కార్యక్రమం అనంతరం పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులతో కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ భేటీ అయ్యారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పోలీస్ నుంచి అందాల్సిన రాయితీలు, ఫలాలను అందే విధంగా కృషి చేస్తానన్నారు.