ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు లబ్ధి
ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఉపకార వేతనం
యువతకు అండగా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి
ఖమ్మం, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ దీటుగా విద్యనందించడంతోపాటు పేద, మధ్యతరగతి విద్యార్థుల విదేశీ విద్యకు ప్రోత్సాహం అందిస్తున్నది. వారి ఉన్నత విద్యకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిగ్రీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు అవసరమైన రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఖమ్మం జిల్లాలో గిరిజనాభివృద్ధి, మైనార్టీశాఖల ద్వారా 32 మంది విద్యార్థులు విద్యానిధి పథకానికి ఎంపికై వివిధ దేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహమిస్తున్నది. ఆర్థిక సహకారం అందుకున్న యువత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నది. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉండి అన్ని అర్హతలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిగ్రీ విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు 2014లో తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి అర్హులైన విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు అవసరమైన రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. పథకం ద్వారా లబ్ధిపొందిన వారు విదేశాలకు వెళ్లి అక్కడే ఉద్యోగావకాశాలు పొందిన వారున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గింది.
ఉన్నత చదువులకు భరోసా..
అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం పొందిన విద్యార్థులు యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో ఇంజినీరింగ్ విద్య, ఎంఎస్ వంటి కోర్సులు, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు అభ్యసించారు. ఆయా వర్గాల విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించడానికి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతల విషయంలో సడలింపులు ఉన్నాయి. గతంలో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2018లో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచింది. దీంతో అనేక మంది విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించే అవకాశం లభించింది. ప్రభుత్వం విడతల వారీగా రూ.20 లక్షలు విడుదల చేస్తున్నది.
డిగ్రీలో 60శాతం మార్కులుంటే అర్హులు..
విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు ఏదైనా డిగ్రీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారికి ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఇప్పటివరకు 24 మంది దళితులు ఈ విద్యానిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ప్రభుత్వ ఆర్థిక సహకారాన్ని పొందగలిగారు. అలాగే ఇప్పటివరకు బీసీ సంక్షేమ సంస్థ ద్వారా 35 మంది బీసీ విద్యార్థులు ఈ విద్యాపథకాన్ని ఉపయోగించుకుని విదేశాల్లో విద్య అభ్యసించారు. మరికొందరు దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా ఇప్పటివరకు 15 మంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులు చేసేందుకు విదేశాలకు వెళ్లేందుకు విద్యానిధి పథకం ద్వారా ఆర్థిక సాయం పొందారు. మైనార్టీ శాఖ ద్వారా 17 మంది విద్యార్థులు ఈ విద్యానిధి పథకానికి ఎంపికై వివిధ దేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు విద్యా నిధికి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
‘టీ-ప్రైడ్’తో పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం
కొత్తగూడెం అర్బన్, జూలై 20 : యువ పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్(టీ-ప్రైడ్) పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వారి కాళ్లపై వారు నిలబడేందుకు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు త్పోడ్పాటు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పరిశ్రమ నెలకొల్పాలంటే ఎన్నిరకాల ఆంక్షలు, అనుమతులు, నియమ, నిబంధనల కోసం నెలల తరబడి వేచిచూసిన రోజుల నుంచి కేవలం 30 రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అన్నీ రకాల అనుమతులు ఇచ్చి సులభతర వాణిజ్య విధానానికి తెరతీసింది. కేవలం అన్నీ ధ్రువ పత్రాలు సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే అనుమతులను ఇచ్చి పరిశ్రమలను నెలకొల్పేందుకు ‘టీఎస్-ఐపాస్’ను ఏర్పాటు చేసింది. ఇలా చట్టబద్ధమైన హక్కును కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. దేశంలో మరెక్కడ ఇలాంటి విధానం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రాష్ర్టాల ఎంటర్ప్రెన్యూర్లు, దేశ విదేశాల పారిశ్రామిక వేత్తలు ‘టీఎస్-ఐపాస్’లో తమ పేర్లను నమోదు చేసుకొని కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
యువతకు ప్రోత్సాహం
దేశ, విదేశ పారిశ్రామికవేత్తలకు కంపెనీలు నెలకొల్పేందుకు అవకాశాలు ఇస్తూనే, రాష్ట్రంలోని యువత కోసం పారిశ్రామిక రంగంలోనూ రిజర్వేషన్ల ప్రాతిపదికన వారిని ప్రోత్సహించేందుకు టీ-ఐడియా, టీ-ప్రైడ్ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. షెడ్యుల్ కులం, షెడ్యుల్ తెగలవారికి పారిశ్రామిక ప్రోత్సాహక రాయితీ పథకం (టీ-ప్రైడ్) ప్రవేశపెట్టింది. ‘టీ-ప్రైడ్’తో ఎస్సీ, ఎస్టీల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం ఉన్నవారికి వెన్నుతట్టి తెలంగాణ సర్కార్, పరిశ్రమలశాఖ ప్రోత్సహిస్తున్నది. వారికి అన్నీవిధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా ముందడుగు వేసేందుకు తోడ్పాటునిస్తున్నది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పేవారికి రూ.75 లక్షల లోపు ఉన్న పరిశ్రమలకు 35శాతం సబ్సిడీ, ఆసక్తి ఉన్న మహిళలు యూనిట్ల విలువ రూ.10లక్షలలోపు ఉంటే 10శాతం రాయితీ, పరిశ్రమల కోసం కొనుగోలు చేసే భూములు, లీజు, భవనాలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100 శాతం తిరిగి రాయితీ పొందే అవకాశాన్ని కల్పించింది. విద్యుత్, సేల్స్టాక్స్, బ్యాంకు నుంచి తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లింపు తదితర వాటిపై ప్రత్యేక రాయితీలను అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తున్నది.
ప్రభుత్వ సహకారం బాగుంది
నా భర్త చొరవతో ట్రాన్స్పోర్ట్ వాహన రుణం కోసం పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేశాను. దరఖాస్తులను పరిశీలించిన పరిశ్రమల శాఖ అధికారులు వచ్చి సర్వే చేశారు. అనంతరం పరిశ్రమల అధికారి నుంచి అనుమతి వచ్చాక బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారు. ప్రస్తుతం మా కుటుంబం ఉపాధి పొందుతూనే మరొకరికి ఉపాధి కల్పిస్తున్నది. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగినా రుణం వస్తుందనే నమ్మకం లేకుండే. కానీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నాకు ప్రయోజనం చేకూరింది.
మరింతమందికి అవకాశం
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పరిశ్రమలశాఖ సహకారంతో ‘టీ-ప్రైడ్’ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అనేకమంది ఎస్సీ, ఎస్టీల్లోని యువత ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగాల కోసం కాళ్లారిగేలా తిరిగిన యువత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో పరిశ్రమలు నెలకొల్పి తామే ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 356 మంది ఎస్టీలకు రూ.23.42 కోట్ల సబ్సిడీని మంజూరు చేశారు. 160 మంది ఎస్సీలకు రూ.17.38 కోట్ల సబ్సిడీని మంజూరు చేసింది. మొత్తంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు 516 యూనిట్లకు రూ.40.80 లక్షలను సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా సుమారు 1,500 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టీ-ఫ్రైడ్లో ఎక్కువగా ట్రాన్స్పోర్టు వాహనాలు, జేసీబీలు, ట్రాక్టర్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు రైస్ మిల్లులు, ఎగ్ట్రేలు, పేపర్ కన్వర్షన్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.