నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదు
ఢిల్లీ, అమరావతిలో దీక్షలు చేయాలి
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కొత్త ఉద్యోగాలు ఇచ్చాం
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం, జూలై 21 : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ దీక్ష కాకుండా రాజకీయ నిరుద్యోగ యాత్ర అని పేరుపెట్టుకొని పర్యటిస్తే బాగుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి, ఢిల్లీలో దీక్షలు చేస్తే బాగుంటుందని సూచించారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలు, పొరుగున ఉన్న ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆ సమయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని ప్రశ్నించారు. 1.57 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కానిస్టేబుల్, హోం గార్డులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్శాఖ, ఆర్టీసీలో వేలాది ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తల వంటి చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పీఆర్సీని అమలు చేశామన్నారు. చిన్న ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? అని ప్రశ్నించారు. ఐటీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో మరో 18 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు చెప్పారు. నిరుద్యోగ సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, నిరుద్యోగులను ఆత్మహత్యల వైపు పురిగొల్పడం సరికాదన్నారు. విదేశాల్లో చదువుకుంటున్న ఎస్సీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.10 నుంచి రూ.25 లక్షలకు పెంచారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ మాట్లాడుతూ షర్మిలది నిరుద్యోగ దీక్ష కాదని, రాజకీయ నిరుద్యోగ దీక్ష అన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.