అన్నదాతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రాయితీలు
ఎస్సీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీ
ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఖమ్మం వ్యవసాయం/ చుంచుపల్లి, జూన్ 21: సూక్ష్మనీటి సేద్యం రైతులకు వరంగా మారింది.. తక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ప్రతి బొట్టును ఒడిసి పట్టి పంటకు వినియోగించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతున్నది.. ప్రభుత్వం అన్నదాతలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో ‘డ్రిప్ ఇరిగేషన్’పై ఆసక్తి పెరుగుతున్నది.. మొదట్లో మెట్ట ప్రాంతాల్లో ఈ పద్ధతిని వినియోగించిన రైతులు ఇప్పుడు వాణిజ్య పంటలకూ ఉపయోగిస్తున్నారు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై ప్రభుత్వం ‘డ్రిప్’ సామగ్రి అందిస్తుంది..
నీరు వృథా కాకుండా మొక్కలకు సరిపడేంత అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు బిందుసేద్యం ఎంతో తోడ్పడుతుంది. సూక్ష్మ సేద్య స్కీం ఒక నిరూపమానమైన పథకం. పంటల ఉత్పాదకతను, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ లక్షలాది మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో సాగు విస్తీర్ణం జరిగేందుకు గాను సూక్ష్మ నీటి సేద్యం ఎంతగానో ఉపయోగపడుతున్నది. సూక్ష్మ నీటి పథకంలో రెండు రకాల సేద్యాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి బిందు సేద్యం. మరోటి తుంపర సేద్యం. మొక్క మొదలుకు నీరు అందించే ప్రక్రియ బిందు సేద్యం ద్వారా జరుగుతుంది. మొక్కపై తేమశాతం పెంచేందకు తుంపర సేద్యం ఉపయోగపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆది నుంచీ సూక్ష్మనీటి పథకానికే రైతుల నుంచి ఆదరణ కన్పిస్తోంది. ఒకప్పుడు ఒకటి రెండు పంటలకు మాత్రమే ఈ పద్ధతులను ఉపయోగించిన రైతులు.. ఇప్పుడు కూరగాయలు, పండ్లు, పూల తోటలతోపాటు, మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటల సాగుకు సైతం వినియోగించడం విశేషం. దీంతో నీరు ఆదా అవుతుంది. కలుపు పెద్దగా పెరగదు. శ్రమ శక్తి కూడా తక్కువ అవసరం పడుతుంది. సన్న, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కారు.. వారి ఆర్థికాభివృద్ధి కోసం భారీ రాయితీలు అమలు చేస్తోంది. యూనిట్ల సంఖ్యను సైతం పెంచింది. గతంలో ఉన్న ఆంక్షలు కూడా తొలగించడం రైతులు మరింత ఆసక్తి కనపరుస్తున్నారు.
సాగు నీటి ఆదాకు దోహదం..
సూక్ష్మనీటి పథకం ద్వారా సాగునీరు ఆదా చేసుకునేందుకు మంచి అవకాశం ఉంది. జిల్లాలో ఆయకట్టు ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో సాగుకు దోహదం చేస్తుంది. ఉద్యాన పంటలైన కూరగాయలు, ఆకు కూరలు, మిర్చి, మామిడి, జామ, నిమ్మ తోటలను ఎక్కువగా డ్రిప్ సహాయంతో సాగు చేస్తున్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆయిల్పాం రైతులు సైతం వంద శాతం డ్రిప్ సహాయంతో పంటల సాగు చేస్తున్నారు. కొబ్బరి, అరటి, ఆయిల్పాం పంటల్లో అంతర పంటలుగా వేరుశనగ సాగు చేసే రైతులు.. కూరగాయల సాగు చేసే రైతులు అక్కడక్కడా తుంపర సేద్యం ద్వార సాగు చేస్తున్నారు. ఈ సాగు వల్ల 40 నుంచి 70 శాతం నీరు ఆదా అవుతుంది. 30 నుంచి 50 శాతం వరకు అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కూలీల తగ్గుతుంది. వాలుగా ఉన్న భూముల్లో కోత ఉండదు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
సూక్ష్మనీటి పథకం కోసం దరఖాస్తు చేసుకునే రైతులు తొలుత మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా తమ పేరు, వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భూమికి సంబంధించిన ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుంది. అనంతరం మండల ఉద్యాన అధికారి, సూక్ష్మనీటి పథక అధికారి దగ్గర దరఖాస్తు తీసుకొని పూర్తి వివరాలు పొందు పర్చాలి. దీంతోపాటు పాస్పోర్టు సైజ్ ఫొటో అతికించాలి. స్థానిక వీఆర్ఓ, ఎంఐఏఓ, ఎంసీఓ, డ్రిప్ పరికరాలు అందించే కంపెనీ బాధ్యుడి, సంతకాలు ఉండాలి. తహసీల్దార్/ డిప్యూటీ తహసీల్దార్ టైటిల్ డీడ్ నకలును ధ్రువీకరించారు. ఏదైనా గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి. వీఆర్వో జారీ చేసిన భూమి పటం జత చేయాలి. రైతు ఫొటో కలిగిన గుర్తింపు కార్డు, కుల ధ్రువపత్రం జతపరచాలి. వీటితో గ్రామసభ తీర్మానం పొందుపర్చాలి.
తెలంగాణ సర్కారు అందిస్తున్న రాయితీలు..
గతంలో ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ కొన్ని ఆంక్షల వల్ల పూర్తి స్థాయిలో రైతులకు చేరువకాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉన్న 80 శాతం రాయితీని 100 శాతానికి పెంచింది. ఒకసారి ఈ పథకం పొందిన రైతు తరువాత పదేళ్ల వరకూ దరఖాస్తు చేసుకునే వీలుండేదికాదు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. 12 ఎకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం చొప్పున రాయితీలు ఆందిస్తున్నారు. జిల్లాకు యంత్ర పరికరాలు అందించేందకు ప్రస్తుతం జైన్, నెటాఫిన్, సిగినెట్, ఫినలెక్స్, నాగార్జున తదితర కంపెనీలు అందుబాటులో ఉన్నాయి.
బిందుసేద్యం బాగుంది
నేను బిందు సేద్యం తోనే పంటలు సాగు చేస్తున్నాను. నాకున్న పొలంలో అధికారుల సూచనలతో బిందుసేద్యం ఏర్పాటు చేసుకున్నాను. దీని వల్ల పొలం మొత్తం నీరు తడవకుండా కేవలం మొక్కలు ఉన్న చోట మాత్రమే నీరు పడుతుంది. దీంతో పంటలో కలుపు కూడా ఎక్కువగా రావడం లేదు. కూలీల ఖర్చు కూడా ఆదా అయింది. తక్కువ సమయంలో అన్ని మొక్కలకు ఒకేసారి సరిపడా నీరు అందుతుంది.
-తాళ్లూరి పాపారావు, భద్రాద్రి జిల్లా రైతు