ఖమ్మం అక్టోబర్ 20, (నమస్తేతెలంగాణ ప్రతినిధి) :“ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ పార్టీ అవతరించింది. కార్యకర్తల సమష్టి కృషి నాయకుల రాజకీయ వ్యూహంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా రూపుదిద్దుకున్నది. అదే స్ఫూర్తితో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలు, పార్టీ సంస్థగత నిర్మాణంపై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. వరంగల్లో నిర్వహించే విజయగర్జన బహిరంగ సభ విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సైనికులై కదలి రావాలని, టీఆర్ఎస్ సత్తా మరోసారి చాటిచెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. – ఖమ్మం, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొనాలని వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఖమ్మం, పాలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నవంబర్ 15న వరంగల్ జరిగే విజయగర్జన సభకు రాజకీయ ప్రాధాన్యం ఉన్నదని, పార్టీ సత్తా ఏమిటో మరోసారి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులై కదలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఏపార్టీకీ రానంత జనం టీఆర్ఎస్ బహిరంగ సభకు వస్తారని, దానిని మరోసారి నిరూపించాలని కోరారు. ప్లీనరీ, బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ, మండలస్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ఈ నెల 27న జరిగే నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలలోపు వీటిని పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకు ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తుందని, త్వరలో పెద్దఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ ఉంటుందన్నారు.
పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ..
జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం త్వరలోనే ఉంటుందని, నవంబర్ 15వ తేదీన నిర్వహించే విజయగర్జన బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేసేలా పార్టీశ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనతో ప్రజల గుండెల్లో బలమైనస్థానం దకించుకున్నారన్నారు. ప్రతిసారి ప్రజలు పార్టీపై తమ ప్రేమను వ్యక్తపరుస్తూ వస్తూనే ఉండడం దీనికి నిదర్శనమన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అపూర్వమైన కార్యక్రమాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నదని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమాయత్తం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, భద్రాచల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆయన సమావేశానికి హాజరుకాలేకపోయారు. ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడకు యువనేత ప్రశంస..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ని ఈ సమావేశంలో టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర నాయకులను ఆరా తీయగా.. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందుందని నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మంత్రి పువ్వాడ అజయ్ని ప్రత్యేకంగా అభినందించారు. అజయ్కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పార్టీకి విజయాలే తప్ప.. ఓటమి చవిచూడలేదు. పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో పని చేయడంతో ఊహించిన దానికంటే పార్టీ సంస్థాగతం నిర్మాణం పూర్తయిందన్నారు. వ్యూహ చతురత, చిత్తశుద్ధితో అసాధారణ విజయాలు సొంతమయ్యామని పేర్కొన్నారు.