ఖమ్మం జిల్లాలో పర్యటించిన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి
హాజరైన ఖమ్మం,భద్రాద్రి, నల్లగొండ కలెక్టర్లు
అటవీ, రెవెన్యూశాఖల అధికారులతో సమీక్ష
ఖమ్మం, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలోని ప్రత్యేక బృందం బుధవారం నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో మూడు జిల్లా కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో పోడు భూముల పరిస్థితి, ఎంత శాతం అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు అనే సమాచారం క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తతం ఇంకా ఎంతమందికి ఎన్ని ఎకరాలు పోడు పట్టాలు అందించాలనే సమగ్ర సమాచారంతో చర్చించారు. అటవీ, రెవెన్యూ చట్టాలతోపాటు ప్రస్తతం అటవీ సంరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా సమాలోచనలు చేశారు. ప్రత్యామ్నాయ పరిస్థితులు, అడవుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారులు శోభ, శ్రీనివాస్, భీమానాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయా జిల్లాలో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.