పీర్లకు నూతన వస్ర్తాలు, పుష్పాలతో అలంకరణ
అమర వీరుల స్మరణగా పీర్ల ఊరేగింపు
చావిళ్ల వద్ద సందడి
ఖమ్మం కల్చరల్/రఘునాథపాలెం, ఆగస్టు 20:త్యాగనిరతికి చిహ్నమైన ముస్లిం అమరవీరుల స్మరణగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలో మొహర్రం ఊరేగింపులు జరిగాయి. ముస్లింలు పీర్ల చావిళ్లలోని పీర్లను వీధుల్లో ఊరేగించారు. ప్రాణత్యాగం చేసిన ముస్లిం వీరులు ఇమామే హుస్సేన్, ఇమామే హసన్ను స్మరించారు. వీధుల్లోకి వచ్చిన పీర్లకు కుల మతాలకు అతీతంగా నీళ్లారబోశారు. దీంతో వీధుల్లో సందడి నెలకొన్నది. మత పెద్దలు పిల్లాపాపలను ఆశీర్వదించారు.
నగరంలోని పీర్ల చావిళ్ల వద్ద శుక్రవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పీర్లను పుర వీధులలో ఊరేగించారు. అమరులు హుస్సేన్ సోదరులను స్మరించారు. నగరంలోని ఖిల్లాబజార్, తుమ్మలగడ్డ, శుక్రవారపుపేట, నిజాంపేట, రిక్కాబజార్, మమత హాస్పిటల్ రోడ్, పుట్టకోట, రేవతి సెంటర్, కోయచెలకలో పీర్ల ఊరేగింపు జరిగింది.
దర్గాలో మేయర్ పూజలు
రిక్కాబజార్లోని సయ్యద్ నదీముల్లా హుస్సేన్ షా ఖాద్రీ దర్గాలో శుక్రవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం వెయ్యి మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర నాయకులు గోళ్ల వెంకట్, మున్నా, గౌతమ్ బాబా, శ్రీను, ఆసిఫ్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, నయీమ్, మజీద్ పాల్గొన్నారు.