మహబూబ్నగర్టౌన్, జూలై 12: కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమైన విషయం విధితమే.. దీనికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులు దూరదర్శన్ యాదగిరి, టీ-శాట్ ద్వారా పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి తరగతులు పర్యవేక్షిస్తున్నారు. కానీ, పిల్లల అభ్యసన ముదింపులకు ఎలాంటి సాధనాలు లేవు. దీంతో పిల్లలు పాఠాల ద్వారా ఏం నేర్చుకున్నారో అంశంపై అధ్యయనం చేయడానికి ఎలాంటి ప్రక్రియ అందుబాటులో లేదు. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల కోసం ‘ ఇంటింటా చదువుల పంట’ అనే వినూత్న కార్యక్రమాన్నిప్రారంభించింది. గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనప్పటికీ ప్రక్రియను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నది. ఈ విధానానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నది. విద్యాశాఖ 85955 24405 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా ముదింపు చేపడుతున్నది.
రిజిస్ట్రేషన్ విధానం ఇలా..
ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందుగా విద్యార్థులు పైన తెలిపిన వాట్సాప్ నెంబర్కు హలో అని సందేశం పంపాలి. వెంటనే రిజిస్ట్రేషన్కు సంబంధించిన సందేశం వస్తుంది. ఈ సందేశం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో ఏదో ఒక భాషను ఎంచుకోవడానికి వీలున్నది. భాషను ఎంచుకున్న తర్వాత జిల్లా, మండలాన్ని ఎంచుకోవాలి. అనంతరం ఏ తరగతి చదువుతున్నామో ఆ నెంబర్ను ఎంపిక చేయాలి. ఆ తర్వాత విద్యార్థి పూర్తి పేరు టైప్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం రిజిస్ట్రేషన్కు ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్తో ఎంతమంది విద్యార్థుల వివరాలైనా ఆన్లైన్ చేసుకోవచ్చు.
పరీక్ష విధానం ఇలా..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పరీక్ష ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్ స్క్రీన్పై ఒక దాని తర్వాత ఒకటి ఎనిమిది ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత చివరకు విద్యార్థి ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాడనే ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తున్నది. విద్యార్థి ఇంకా నేర్చుకోవాల్సి ఉందని, రాష్ట్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్న విద్యాశాఖ అధికారులు భావిస్తే వెంటనే విద్యార్థి మొబైల్కు అదే సబ్జెక్టుకు సంబంధించిన పాఠాలను వీడియో రూపంలో పంపిస్తారు. దీంతో సదరు విద్యార్థి మళ్లీ పాఠం నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును ఈ విధానంలో ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఈ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లా స్థాయిలో మానిటరింగ్
జిల్లా స్థాయిలో ఈ ప్రక్రియను మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఈ విధానంలో ఎంత మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.? ఎంత మంది ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.? వారిలో ఎంతమంది బాగా ఆన్సర్ చేస్తున్నారు.? వారికి మెరుగైన విద్య అందించాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 4వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
విద్యార్థులకు ప్రయోజనం
ప్రస్తుత కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమైన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా విద్యాశాఖ ఇంటింటా చదువుల పంట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యం పెరుగుతున్నది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ ప్రక్రియను వివరించాలి. పిల్లలు సులభంగా విద్య నేర్చుకునేందుకు ఈ విధానం చక్కటి ఎంపిక.