వికారాబాద్ : హరితహారం మొక్కల సంరక్షణ పూర్తి బాధ్యత లోకల్ బాడీలకు ఉంటుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ఆరు కిలోమీటర్లు పొడవునా నాలుగు వేల మొక్కలను పది నిముషాలలో నాటడం అభినందనీయమని విద్యా శాఖ మంత్రి అధికారులను ప్రశంసించారు.
శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులోని కొత్రేపల్లి వద్ద మంత్రి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరు పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. మొలకెత్తని మొక్కల స్థానంలో వెంటనే వాటిని తొలగించి కొత్త మొక్కలు నాటాలన్నారు. శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్ ఈవిషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నాటిన మొక్కలన్నీ వంద శాంతం బతికే చూడాలన్నారు. కోత్రేపల్లి నుంచి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు మొక్కలను నాటినట్లు తెలిపారు.
ఇందులో పాల్గొన్న అన్ని శాఖల అధికారులకు ప్రత్యేకంగా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ అధికారును అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతిలాల్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల, వైస్ చైర్మన్ శంషాద్ బేగం, తదితరులు పాల్గొన్నారు.