న్యూఢిల్లీ, జూలై 8: ఐటీ దిగ్గజం టీసీఎస్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,008 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 28.5 శాతం వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 18.5 శాతం పెరుగుదలతో రూ.38,322 కోట్ల నుంచి రూ.45,411 కోట్లకు చేరింది. అయితే ఈ జనవరి-మార్చి కంటే కంపెనీ లాభం తగ్గింది. మార్చి త్రైమాసికంలో రూ.9,246 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆదాయం మాత్రం ఈసారే అధికంగా ఆర్జించింది. కానీ ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. కాగా, గురువారం సమావేశమైన టీసీఎస్ బోర్డు షేరుకు రూ.7 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది.
తాజా ఫలితాలు రెండు మార్కెట్ల కథ అని, తమకు ప్రధాన మార్కెటైన అమెరికాలో వ్యాపా రం బాగా పెరిగితే, కంపెనీకి చిన్న మార్కెటైన ఇండియాలో తగ్గిందని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ అన్నారు. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ వేవ్తో దేశీయ ఆదాయం రూ.350 కోట్లు తగ్గిందని, రూ.2,085 కోట్లుగా నమోదైందన్నారు.
‘ఉత్తర అమెరికాలో మా వ్యాపారం గణనీయంగా పెరిగింది. అలాగే బీఎఫ్ఎస్ఐ, రిటైల్ విభాగాల్లో కూడా మంచి వృద్ధి సాధించాం. ఉద్యోగులు ఒకరికొకరు తోడ్పాటుగా ఉంటూనే, క్లయింట్ల ప్రాజెక్టుల్ని డెలివరీ చేయడం ద్వారా అద్భుతమైన వ్యక్తిత్వాల్ని ప్రదర్శించారు. కొవిడ్-19 కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం, మూడోవేవ్ వస్తుందన్న భయాల నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్ని కంపెనీ గమనిస్తోంది, వ్యాపార అవకాశాలపట్ల ఆశాభావంతో ఉన్నది. ’
–రాజేష్ గోపినాథన్, సీఈవో, ఎండీ
జూన్ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా 5 లక్షల మార్క్ను దాటింది. నికరంగా ఈ క్వార్టర్లో 20,409 ఉద్యోగులు రిక్రూ ట్ కావడంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,09,058కి చేరింది.