హైదరాబాద్ : తెలంగాణలో పాదయాత్రలు చేపడుతామని ప్రకటిస్తున్న ఆయా పార్టీల నాయకులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు సంధించారు. సింగరేణి బీఎంస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైంది. ఆయా పార్టీల నేతలు ఒకరికి మించి ఒకరు ప్రకటనలు చేసుకుంటున్నారు. పాదయాత్రలు బ్రహ్మాండంగా చేయండి. కరోనా వచ్చింది కాబట్టి ఆరోగ్యం కూడా మంచిగైతది అని చురకలంటించారు. పాదయాత్ర చేస్తానన్నబండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ప్రతి ఊరును సందర్శించి పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. పల్లెలు ప్రగతి బాటలో ఎలా వెళ్తున్నాయో చూడాలన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో రైతు వేదికలు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంప్ యార్డులు ఏర్పాటు చేశాం. పల్లెలన్నీ పూలతో, చెట్లతో స్వాగతం పలుకుతాయి. ప్రతి గ్రామానికి ట్యాంకర్, ట్రాక్టర్ సమకూర్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి పనులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఈ ఏడేండ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్కు సవాల్ చేశారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వరు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ.. కేంద్రం స్పందించలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.