రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయి. దుక్కి దున్నడం నుంచి పంట కోతవరకు కావాల్సిన మోతాదులో ఎరువులు అందించి, తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందవచ్చు. గత 20 ఏండ్లుగా ప్రధాన ఆహారపంటల్లో పోషకాల స్థాయి పడిపోతున్నది. వ్యవసాయ పద్ధతుల్లో లోపాల కారణంగా, రైతులు అధిక పెట్టుబడి పెట్టి ఎరువులు వేస్తున్నా ఆశించిన స్థాయిలో అవి మొక్కకు అందడం లేదు. దీంతో నేలలోని సేంద్రియ కర్బన రసాయన అవశేషాలను ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నేల సత్తువ క్షీణించేకొద్దీ మొక్కల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. మోతాదుకు మించి వేస్తున్న రసాయనాలవల్ల దిగుబడుల సంగతి అటుంచి, నేల చౌడుబారి పోతున్నది. పౌష్టికాహార సమస్యనుంచి బయటపడేందుకు ఆహారోత్పత్తులను పెంచుకోగలిగాం. కానీ, ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఆహారపంటల్లో పోషకాల లభ్యత క్రమంగా పడిపోతున్నదని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడించారు. వరి, గోధుమ, మొక్కజొన్నల్లో యాభై ఏండ్ల క్రితం ఉన్న పోషకాలు నేడు లేవని ఆ అధ్యయనం పేర్కొంది. దిగుబడులు పెంచడం కోసం రసాయన ఎరువులు వేయడంపై ఉన్న శ్రద్ధ నేలల సంరక్షణపై ఉండటం లేదు. జింక్ ఐరన్ లోపంతో బాధపడుతున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతున్నది. జింక్ పాస్ఫేట్ మొక్కలకు అందకుండా భూమిలోనే ఉండటం వల్ల వరి, గోధుమల్లో జింకు లోపం తలెత్తుతున్నది. మన నేలల్లో ఐరన్ 70 శాతం వరకు ఉంది. పంటకు లభ్యం కాని రూపంలోనే ఉండిపోవడం వల్ల మొక్కలు గ్రహించలేక పోతున్నాయి. దిగుబడులు పెరిగేందుకు ఇష్టానుసారం ఎరువులు, రసాయనాలను వాడటంతో నేలలో సహజంగానే ఉండే, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరిస్తున్నాయి. ఫలితంగా నేలలో పోషకాలు ఉన్నా అక్కరకు రావడం లేదు. ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులు వాడినా కూడా, అవి సమర్థంగా పని చేయాలంటే నేలలో సేంద్రియ కార్బన్ ఉండాలి. కార్బన్ తగ్గడంతో అత్యుత్తమ విత్తనాలను వేసినా కూడా, నేలలు స్పందించే శక్తిని కోల్పోతున్నాయి. ఫలితంగానే ఆహారపంటలో పోషకాల స్థాయులు పడిపోతున్నాయి. రైతు మేల్కొనకపోతే జాతి నిర్వీర్యం అవుతుంది.
జగదీశ్వర్
డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్
ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం
తమ్మడి మాసయ్య