ముచ్చటగా మూడు కార్యక్రమాలు ప్రారంభం
ఇప్పటికే సిద్ధమైన ప్రణాళికలు..
గ్రామాలు, పట్టణాల్లో పదిరోజుల పాటు పనులు
ఆయాచోట్ల ప్రారంభించనున్న ప్రముఖులు
హుజూరాబాద్లో మంత్రి గంగుల ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ‘పల్లె మురువాలి.. పట్టణం మెరువాలి.. పచ్చదనం వెల్లివిరియాలి’ అనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న రాష్ట్ర సర్కారు, నేటి నుంచి మరో దఫా పల్లె, పట్టణ ప్రగతి.. హరితహారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ముచ్చటగా మూడు కార్యక్రమాలు గురువారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా ఉమ్మడి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. పదిరోజుల పాటు నిర్వహించే ప్రగతి పండుగ కోసం ప్రణాళికలు రూపొందించడంతోపాటు హరితహారం వేడుకకు మొక్కలు రెడీగా ఉంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మంత్రి కేటీఆర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల, హుజూరాబాద్లో మంత్రి గంగుల, శ్రీకారం చుట్టనుండగా, ఆయాచోట్ల అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు గురువారం నుంచి పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇటు గ్రామాలు, అటు పట్టణాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కాగా, ఇప్పటికే మూడు సార్లు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లు సమకూర్చడం, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు జిల్లాలోని ప్రతి పల్లెకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ప్రతి పల్లెలో పారిశుధ్యం పరిఢవిల్లుతోంది. ఆరు విడతల హరితహారంలో నాటిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే స్థితికి చేరుకుంటున్నాయి. పట్టణాల్లోనే ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రెండు విడతల్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో జిల్లాలోని కరీంనగర్ నగర పాలక సంస్థతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు ప్రగతి పథకం పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోపాటు ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో నిర్వహిస్తున్నది.
ప్రాధాన్యత అంశాలు..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పలు ప్రాధాన్యత అంశాలను అధికారులు గుర్తించి కార్యాచరణ రూపొందించారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి రోజు గ్రామం, పట్టణాల్లోని మురుగు కాలువలు శుభ్రపర్చాలి. పాఠశాలలు, అంగన్వాడీ, వైద్య కేంద్రాలు, మార్కెట్ ప్ర దేశాలు, వాటి టాయిలెట్లను శుభ్రపరచనున్నారు. అంతర్గత రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చివేయనున్నారు. పాత, పురాతన కట్టడాలు, కూలిపోయే ప్రమాదంలో ఉన్న వాటిని తొలగిస్తారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై లేకుండా చేస్తారు. రోడ్ల వెంట ఉండే పిచ్చి మొక్కలను తొలగించడం, ప్రభుత్వ సంస్థల భవనాల పరిసరాలను పరిశుభ్రం చేస్తారు.
గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వెంటనే పూర్తి చేసే విధంగా, నిర్మాణం పూర్తయిన వాటిని సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటారు. వినియోగంలో లేని, వదిలేసిన పాత బోర్లు, బావులను పూడ్చివేస్తారు. నిర్వహణ సమయంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు సరిహద్దుల్లో మొక్కలు నాటుతారు. అంటు వ్యాధులు ప్రబలకుండా, వాటిని నిరోధించేందుకు రోడ్లపై గుంతల్లో నీరు నిలువలు లేకుండా చేస్తారు. మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయడం వంటి పనులు చేపడతారు.
ఏడో విడుత హరితహారంలో గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికీ ఆరు మొక్కలు నివాస గృహాల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తారు. గతంలో నాటిన మొక్కలు చనిపోయిన చోట పొడవాటి మొక్కలు నాటుతారు. ప్రతి ప్రభుత్వ సంస్థ ఆవరణలో వంద శాతం మొక్కలు నాటుతారు. అన్ని రోడ్ల వెంట వంద శాతం అవెన్యూ ప్లాంటేషన్ చేస్తారు. హరిత హారం కింద మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తిస్తారు. లే అవుట్లలోని ఖాళీ స్థలాల్లో వంద శాతం మొక్కలు నాటుతారు. విద్యుత్తు సంస్థ ద్వారా స్తంభాలు, లూజ్వైర్లను సరిచేస్తారు.
రోజు వారీ కార్యక్రమాలు..
పది రోజులపాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు గురువారం ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఇందులో ‘సురక్షిత కరీంనగర్’ పై ప్రత్యేక ప్రతిజ్ఞ తప్పని సరిగా చేయిస్తారు. గ్రామ సభ అనంతరం పాద యాత్ర నిర్వహించి డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, నర్సరీలను సందర్శించి అక్కడి పరిస్థితులను గమనిస్తారు. ఈ పనులు ప్రారంభం కాని చోట ప్రారంభిస్తారు. పెంట కుప్పలను, చెట్ల పొదలను, సర్కారు తుమ్మ, జిల్లేడు, వయ్యారి భామ తదితర చెట్లను తొలగిస్తారు. పాడుబడిన, కూలిపోయిన పనికి రాని శిథిలమైన ఉన్న అన్ని అరకాల భవనాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు ఇచ్చి తొలగిస్తారు. మురుగు కాలువలు, వీధి రోడ్లను శుభ్రం చేస్తారు. ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. ఇంకా ఏమైనా మిగిలి ఉన్న పనికి రాని ఉపయోగం లేని బావులు, బోర్లను పూడ్చివేస్తారు.
రెండో రోజైన శుక్రవారం డ్రైడే పాటిస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో అపరిశుభ్రంగా ఉన్న మురుగు నీటిని తొలగిస్తారు. ప్రతి ఇంటి యజమానులు తమ పరిసరాలను శుభ్రం చేసుకునే విధంగా వాటరింగ్ డేను నిర్వహిస్తారు. నాటిన మొక్కలకు నీటిని పోస్తారు. నర్సరీల్లో మొక్కలను సంరక్షిస్తారు. మినీ వాటర్ ట్యాంకులు, పశువుల తొట్టెలు శుభ్రం చేస్తారు. పైప్లైన్ లీకేజీలను గుర్తించి వాటిని అరికడతారు.
మూడో రోజు నర్సరీలను సందర్శిస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం అన్ని రకాల మొ క్కలను వంద శాతం సంరక్షించే విధంగా చ ర్యలు తీసుకుంటారు. పూర్తి స్థాయిలో మొక్కలను భర్తీ చేస్తారు. పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు గ్రీన్ కమిటీల సమావేశాలు నిర్వహిస్తారు. నర్సరీల పేరుతో బోర్డు లు ఏర్పాటు చేస్తారు. వాటి చుట్టూ కంచెలు నిర్మిస్తారు. మంకీ ఫుడ్ కోర్టులను సందర్శిస్తా రు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాడుబడ్డ బావులను పూడ్చివేయని వారికి నోటీసులు జారీ చేస్తామని డప్పు చాటింపు వేస్తారు.
నాలుగో రోజు స్వయం సహాయక బృందాలు, మహిళలు, యువజన, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ ప్రజలంతా శ్రమదానంలో పాల్గొంటారు. పాద యాత్రలు నిర్వహించి కార్యక్రమ ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తారు. ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేస్తారు. మండల పంచాయతీ అధికారులు, ఎలక్ట్రిసిటీ ఏఈలు సమావేశమై పవర్ వీక్ సమస్యలను గుర్తించి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.
ఐదో రోజు పవర్ వీక్ సమస్యలు పరిష్కరిస్తారు. స్విచ్ బోర్డులు అమర్చుతారు. మీటర్లు ఏర్పాటు చేస్తారు. వదులుగా ఉన్న తీగలను, ట్రాన్స్ ఫార్మర్ వైర్లను సరిచేస్తారు. విరిగిన, వంగిన, తుప్పుబట్టిన కరెంట్ స్తంభాలను తిరిగి అమర్చుతారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాడుబడ్డ బావులు, పిచ్చి మొక్కలు గత ఇండ్లకు నోటీసు జారీ చేస్తారు. వీధి స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాట్లు చేసారు. థర్డ్ వైర్ సదుపాయం కల్పిస్తారు.
ఆరోరోజున ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల కోసం స్థ లాలు గుర్తించి నిర్మాణాలు చేపడతారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలను గు ర్తించి నిర్మాణాలు ప్రారంభిస్తా రు. పంచాయతీ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మా ణం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కలిగిస్తారు. చెత్తాచెదారం పూర్తిగా ఏరివేసి డంప్యార్డులకు తరలిస్తారు. ఇంటిపై పడే వర్షపు నీటి ని ఇంకుడు గుంతల్లో పడే విధంగా చర్యలు తీసుకుంటారు.
ఏడో రోజు మురుగు కాలువలను శుభ్రం చేయడం, మట్టి కుప్పలు తొలగించడం, రోడ్లకు ఇరువైపులా ఉ న్న కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించడం, అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం, ప్లాస్టిక్ వాడకం నిర్మూలన, తడి చెత్తను పోగు చేసి ఎరువుల తయారీ కేంద్రానికి తరలించడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి కలెక్షన్ యూనిట్కు తరలించడం, సంతలు, మార్కెట్ ఏరియాలను శుభ్రం చేయడం, ప్రభుత్వ సంస్థల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయడం, నీటి నిలువ ప్రాంతాలను గుర్తించి దోమల నిర్మూలను ఆయిల్ బాల్ వేయడం వంటి పనులు చేపడతారు.
ఎనిమిదో రోజు నోటీసు జారీ చేసిన పాత భవనాలు, పాడుబడ్డ భవనాల్లో పిచ్చిమొక్కలను తొలగించి వాటి యజమానులకు జరిమానా విధిస్తారు. నీరు నిలువ ఉండే లోతట్టు ప్రాంతాలను పూడ్చడం, మట్టి కుప్ప లు, చెత్త కుప్పలు, చెట్ల పొదలను తొలగించడం, వీధి రోడ్లను శుభ్రం చేసుకోవడం, ఇంకుడు గుంతలు ని ర్మించడం, చెత్తను ఆరుబయట వేసిన వారికి రూ.500 జరిమానా విధించడం వంటి పనులు చేస్తారు.
తొమ్మిదో రోజు మరోసారి డ్రైడేను నిర్వహిస్తారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, డంపింగ్ యర్డులు, ఎరువుల తయారీ కేంద్రాలను పూర్తి చేస్తారు. అపరిశుభ్రంగా ఉన్న నీటిని గుర్తించి చర్యలు తీసుకుంటారు. వాటరింగ్ డేను పాటిస్తారు. నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పోసి సంరక్షిస్తారు.
చివరిదైన పదో రోజు తిరిగి గ్రామ సభ నిర్వహించుకుని పది రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష నిర్వహించుకుంటారు. విధించుకున్న లక్ష్యాలను ఏ విధంగా సాధించాలో నిర్ణయించుకుంటారు.
కరీంనగర్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు..
జిల్లాలో ఏడో విడుత హరితహారంలో జిల్లాలో 44.78 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. గత హరితహారంలో ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లే ఈసారి మండలాల వారీగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని ఏదో ఒక గ్రామంలో పదెకరాలు బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చిగురుమామిడి మండలం సుందరగిరిలో, చొప్పదండి మండలం వెదురుగట్టలో, ఇల్లందకుంట మండలం చిన్న కొమటిపల్లిలో, గంగాధర మండలం ర్యాలపల్లిలో, గన్నేరువరం మండలం హన్మాజీపల్లిలో, హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో, జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్లో, కరీంనగర్ మండలం చామన్పల్లిలో, కొత్తపల్లి మండలం ఎలగందులలో, మానకొండూర్ మండలం ముంజంపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఒక్కో చోట పది ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మిగతా మండలాల్లో గుర్తించే పనిలో ఉన్నారు.