హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): స్థానికసంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాలను 30 శాతం పెంచినందుకు వేములవాడ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంక్షేమసంఘం ప్రతినిధులు కూడా కవితను కలిశారు. వారు పలు సమస్యలను ప్రస్తావించగా రవాణామంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీఇచ్చారు.
భాషాపండితులు, పీఈటీల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలని పండిట్, పీఈటీ ఐక్యవేదిక నాయకులు శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినతిపత్రాన్ని సమర్పించారు. పదోన్నతులపై ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, సీఎం ఇచ్చిన హామీ మేరకు పదోన్నతుల జీవోలు అమలయ్యేలా చూస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. పీఎస్ హెచ్ఎం పోస్టులు త్వరలోనే మంజూరుచేసి, ఎస్జీటీలకు న్యాయం చేసి, న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినట్టు వెల్లడించారు. ఎండీ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, చక్రవర్తుల శ్రీనివాస్ తదితరులు కవితను కలిసినవారిలో ఉన్నారు.