ఇబ్రహీంపట్నం, జూన్ 18 : నియోజకవర్గంలోని ఇండ్లులేని నిరుపేదలకు త్వరలోనే 1400 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో ఇండ్లులేని నిరుపేదలను గుర్తించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచా రం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో అర్హులను గుర్తించి వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
లబ్ధిదారులకు కేటాయిస్తాం..
ఇప్పటికే ఇండ్ల నిర్మాణం పూర్తయిన వాటిని త్వరలోనే అర్హులకు అందజేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. కొత్తగా మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించామని, నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్లు సరిగ్గా స్పందించకపోవడంతో జాప్యం ఏర్పడిందన్నారు. డబుల్ బెడ్రూంల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించి దశల వారీగా నిర్మాణాలు చేపడుతామన్నారు. రాజకీయాలకతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతామన్నారు. ఇండ్ల నిర్మాణ స్థలాల్లో ఎలాంటి సమస్యలున్నా వెంటనే తహసీల్దార్ పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రావణ్ప్రకాశ్, డీఈ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఈ బాలునాయక్, సర్వేయర్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.