న్యూఢిల్లీ: సాహసాలు, ప్రతిభాపాటవాలకు పెట్టింది పేరు భారతీయులు.. పేరుకు అగ్రరాజ్యమైనా అమెరికాలోని ప్రముఖ కంపెనీలకు సీఈవోలు మనోళ్లే.. ఇతర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిలో ఇండియన్లే అధికం. ఒక కార్పొరేట్ సంస్థ సీఈవోగా, చైర్పర్సన్ బాధ్యతలను నిర్వర్తించిన తొలి ఇండియన్ ఇంద్రా నూయి.
ఇప్పటి వరకు గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల గురువారం సంస్థ చైర్మన్గా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు సాగిన పయనంలో మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్గా ఉన్నత శిఖరానికి ఎదిగిన తొలి తెలుగు తేజం.. రెండో ఇండియన్ సత్య నాదెళ్ల.
ప్రముఖ శీతల పానీయాల కంపెనీ పెప్సికో సీఈవో.. చైర్పర్సన్గా పని చేసిన ఇంద్రా నూయి మన ఇండియనే. 2017లో ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్న ఇంద్రానూయి.. ఫోర్బ్స్ మోస్ట్ పవర్ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.
తమిళనాడు రాజధాని మద్రాస్లో జన్మించిన ఇంద్రానూయి.. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ.. 1976లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తాలో 1976లో పీజీ డిప్లమా కోర్స్ పూర్తి చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో 1978లో చేరిన ఇంద్రానూయి.. 1980లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్లో పీజీ పట్టా స్వీకరించారు.
1994లో పెప్సికోలో ఇంద్రానూయి కెరీర్ ప్రారంభమైంది. క్రమంగా తన ప్రతిభకు పదును పెడుతూ ఆమె 2006లో అప్పటి సీఈవో స్టీవెన్ రైనెమండ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. అటు తర్వాత సంస్థ చైర్పర్సన్గా 12 ఏండ్లు పని చేశారు. 2018లో పెప్సికో నుంచి చైర్ పర్సన్ హోదాలో వైదొలిగారు.
సంస్థలో ప్రధాన వ్యూహకర్తగా పెప్సికోలో కెరీర్ ప్రారంభించిన ఇంద్రానూయి.. సీఈవోగా ఉన్నప్పుడు సంస్థ నికర ఆదాయం 5.5% పెరుగుతూ వచ్చింది. ఆమె హయాంలో పెప్సికో షేర్.. స్టాక్ మార్కెట్లో బజ్ క్రియేట్ చేసింది. పెప్సికో షేర్ రెండు రెట్లకు పైగా పెరిగింది.
పెప్సికోలో కీలక బాధ్యతలు స్వీకరించిన ఇంద్రానూయి.. 1998లో ట్రోపికానీ టేకోవర్ చేసుకునే విషయంలో ఇతర పెప్సికో ఎగ్జిక్యూటివ్ల నుంచి ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నారు. తర్వాత 2001లో పెప్సికోలో ఖ్వార్ ఓట్స్,, గాటోరాడ్ విలీనం అయ్యాయి. పెప్సికోలో స్వాధీనం చేసుకున్న తర్వాత కోకాకోలాకు పోటీదారుగా నిలిచింది.
తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్గా బాధ్యతలు అందుకోనున్న సత్య నాదెళ్ల.. హయాంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడు రెట్లు పెరిగి 2లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు స్వీకరించే నాటికి మైక్రోసాఫ్ట్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సవాళ్లను ఎదుర్కొన్నది
సత్వరం వృద్ధి సాధించే లక్ష్యంతో కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్లు, కృత్రిమ మేధ (ఏఐ), తదితర నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించారు.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని పూర్తిగా సత్య నాదెళ్ల నవీకరించారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరించారు సత్య నాదెళ్ల. ఆపిల్ ఐప్యాడ్ కోసం ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆవిష్కరించారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ తీసుకొచ్చారు. విండోస్ 9ను వదిలేసి నేరుగా విండోస్ 10 ఆవిష్కరించారు.
క్లౌడ్ కంప్యూటింగ్.. తదితర కొన్ని విభాగాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విభాగంలో గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ అధిక ఆదాయాలు నమోదు చేసే స్థితికి ఎదిగింది. ఈ మార్పులతో ఒక అగ్రశ్రేణి ఐటీ కంపెనీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.