నిర్మల్: ఏడేండ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లొ మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల సేవలను గుర్తు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలే ప్రథమ ప్రాధన్యతగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో తెలంగాణ జలసిరితో కళకళ లాడుతోందని తెలిపారు.
ఇక రైతుబంధు దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. ఈ పథకానికి ఏటా రూ.15 వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పారు. రైతుబీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతున్నదని వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.