హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఔషధం పంపిణీని నాలుగైదు రోజుల్లో వికేంద్రీకరణ, ఆన్లైన్ ద్వారా ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి.. మందు పంపిణీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మందు పంపిణీ గురించి ప్రకటించేవరకు ఇతరులెవరూ గ్రామంలోకి రావొద్దని ఆనందయ్య కోరారు. సర్వేపల్లి నియోజకవర్గానికే తొలి ప్రాధాన్యం కింద మందు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు, కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. ఆనందయ్య ఔషధాన్ని టీటీడీ ఆధ్వర్యంలో తయారుచేసే అంశాన్ని సీఎం జగన్మోహన్రెడ్డితో చర్చిస్తానని తుడా చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు.