ఆపత్కాలంలో సంగారెడ్డి జిల్లాలోని ఆక్సిజన్ పరిశ్రమలు అండగా మారాయి. కొవిడ్ రోగులకు ప్రాణాధారమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అవసరం రోజురోజుకూ పెరుగుతుండగా, కావాల్సినంత ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నది. లిక్విడ్ ఆక్సిజన్ తయారీ, సరఫరా కంపెనీలను ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నందున సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రాగ్స్ ఎయిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, లిండే ఇండియా లిమిటెడ్ కంపెనీలు జోరుగా ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు దవాఖానలకు నేరుగా ఆక్సిజన్ను సరఫరా చేయడమే కాకుండా ఆక్సిజన్ రీఫిల్లర్లకు సైతం ప్రాణవాయువును అందిస్తున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ దవాఖానలకు నిత్యం భారీగా లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరా చేస్తూ కొవిడ్ రోగులకు ప్రాణం పోస్తున్నాయి.
సంగారెడ్డి, మే 25(నమస్తే తెలంగాణ):
కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవడంతో ఆక్సిజన్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నది. లిక్విడ్ ఆక్సిజన్ తయారీ, సరఫరా కంపెనీలను ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రాగ్స్ ఎయిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, లిండే ఇండియా లిమిటెడ్ కంపెనీలు జోరుగా ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ దవాఖానలకు నిత్యం భారీగా లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరాచేస్తూ కొవిడ్ రోగులకు ప్రాణం పోస్తున్నాయి. రాష్ట్రంలో అధికశాతం ఆక్సిజన్ ఈ నాలుగు కంపెనీల నుంచే సరఫరా అవుతుండటం గమనార్హం.
దవాఖానలకు అండగా ఐనాక్స్..
పాశమైలారం ఐడీఏ ఫేజ్-1లోని ఉన్న ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిరోజూ పలు దవాఖానలతోపాటు మరో నాలుగు రీఫిల్లర్లకు 50 నుంచి 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని అపోలో, ప్రైమ్, కేర్, కిమ్స్, యశోదా, పేస్, ఏఐజీ దవాఖానలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని కాకతీయ, బీఎంకే, వృద్ధి, కరీంనగర్లోని అపోలో దవాఖానలు ఐనాక్స్ నుంచి ఆక్సిజన్ను పొందుతున్నాయి. అంతేకాకుండా ఐనాక్స్ తన వద్ద ఎప్పుడూ మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉండేలా జాగ్రత్త వహిస్తున్నది.
ఎయిర్ వాటర్ నుంచి నిత్యం 20 మెట్రిక్ టన్నులు..
పాశమైలారం ఫేజ్-3లోని ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆక్సిజన్ను ఉత్పత్తి చేయకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోని తన సొంత కంపెనీలతో పాటు ఒడిశాలోని టాటా – బీఎస్ఎల్ కంపెనీ నుంచి ఆక్సిజన్ నిల్వలను సమకూర్చుకొంటున్నది. డిమాండ్ను బట్టి దవాఖానలు, డీలర్లకు ప్రతిరోజూ 20 మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నది. సంగారెడ్డిలోని దవాఖానలతో పాటు హైదరాబాద్లోని ఈఎస్ఐ, అపోలో, తుంబి, రెయిన్బో, ఒవైసీ, ఆర్సీపురం దవాఖానలు, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తదితర సంస్థలు ఈ కంపెనీ నుంచి ఆక్సిజన్ను పొందుతున్నాయి.
ప్రాగ్స్ ఎయిర్ ఇండియా నుంచి 95 టన్నులు..
ప్రాగ్స్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ప్రతిరోజూ హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోని 28 దవాఖానలు, రీఫిల్లర్లు, డీలర్లకు దాదాపు 95 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని విరించి హెల్త్కేర్, సెంచరీ, సహృదయాలయ, కామినేని, మహావీర్, మెడికవర్, రెయిన్బో, నిఖిల్ తదితర దవాఖానలకు ఆక్సిజన్ను అందజేస్తున్న ప్రాగ్ ఎయిర్ ఇండియా త్వరలో స్థానికంగానే ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది.
లిండే ఇండియా నుంచి 150 టన్నులు..
గతంలో ఇక్కడే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసిన లిండే ఇండియా లిమిటెడ్.. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఉత్పత్తిని నిలిపివేసింది. అయినప్పటికీ వేరే ప్రాంతాల్లోని తమ పరిశ్రమల నుంచి ఆక్సిజన్ నిల్వలను సమకూర్చుకుని రాష్ట్రంలోని వివిధ దవాఖానలు, డీలర్లకు రోజూ 50 నుంచి 150 మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్, ఈఎస్ఐ, రెయిన్బో తదితర దవాఖానలతోపాటు సంగారెడ్డిలోని దవాఖానలు ఈ కంపెనీ నుంచి ఆక్సిజన్ను పొందుతున్నాయి.
రీఫిల్లర్లు సైతం..
పటాన్చెరు ప్రాంతంలోని రీఫిల్లర్లు సైతం ఆక్సిజన్ పరిశ్రమల నుంచి లిక్విడ్ ఆక్సిజన్ను కొనుగోలుచేసి సిలిండర్ల రూపంలో దవాఖానలకు విక్రయిస్తున్నాయి. పోచారం గ్రామంలోని శ్రీ గణేశ్ ఎంటర్ ప్రైజెస్ 5 నుంచి 10 టన్నులు, పటాన్చెరులోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ గ్యాసెస్ సంస్థ 5 టన్నులు, తులసి ఆక్సిజన్ సంస్థ 3 నుంచి 5 టన్నులు, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని లక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సంస్థ 5 నుంచి 17 టన్నుల వరకుకు ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నాయి.
దవాఖానలకు సరఫరా అయ్యే ఆక్సిజన్ సిలిండర్ల పరిమాణం..
డీ – టైప్ సిలిండర్ : 46.7 లీటర్లు
బీ – టైప్ సిలిండర్ : 10.2 లీటర్లు
ఏ – టైప్ సిలిండర్ : 0.20 లీటర్లు
ఎంబీసీ సిలిండర్ : 26 లీటర్లు
నిరంతరం పర్యవేక్షణ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఆక్సిజన్ పరిశ్రమల నుంచి దవాఖానలకు సకాలంలో ప్రాణవాయువు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమల్లో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ పరిశమ్రలను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోని దవాఖాలకు సకాలంలో ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఇద్దరు ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రాజర్షి షా, అదనపు కలెక్టర్, సంగారెడ్డి జిల్లా