నారాయణపేట, మే 23 : జిల్లాలో లాక్డౌన్ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులకు ప్రజలు సహకరించి, కరోనా నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ చేతన అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో తమ పనులను ముగించుకోవాలని, 10 గంటల తర్వాత అత్యవసరమైన వారికి, ఈ పాస్లు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. పాస్ లేని వారిపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 183 ద్విచక్రవాహనాలను, 7 ఫోర్ వీలర్స్తోపాటు త్రీ వీలర్ వాహనాన్ని సీజ్ చేశామన్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత సీజ్ చేసిన వాహనాలను ఇస్తామన్నారు. సరుకుల రవాణా కోసం రాత్రి 9నుంచి ఉదయం 8 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు.
లాక్డౌన్ను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ, డీఎస్పీ
పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును అదనపు ఎస్పీ భరత్, డీఎస్పీ మధుసూదన్రావు పర్యవేక్షించారు. లాక్డౌన్ సమయంలో పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ను నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న 12 వాహనాలను సీజ్ చేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్రెడ్డి, ఆర్ఐ కృష్ణయ్య, ఎస్సై సైదయ్య పాల్గొన్నారు.