బన్సీలాల్పేట్, మే 21: గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ దివీస్ ల్యాబోరేటరీ ముందుకు వచ్చింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళి.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా.. గంటకు 22 వేల లీటర్ల సామర్థ్యంతో లిక్విడ్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు రూ.80లక్షల నిధులను కేటాయించారు. దీనిని గాంధీ మెడికల్ కళాశాల నూతన లైబ్రరీ భవనం సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్లాంట్ ఏర్పాటునకు అవసరమైన భారీ యంత్ర పరికరాలు, 10 వేల లీటర్ల ట్యాంక్, ఎయిర్ కంప్రెషర్, విడి భాగాలు గాంధీకి శుక్రవారం చేరుకున్నాయి. వారం రోజుల్లో ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే గాంధీలో 26 వేల లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ పనిచేస్తుండగా, పీఎం కేర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన గంటకు రెండు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కూడా గతవారం నుంచి పని చేస్తుంది. దివీస్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ పూర్తి అయితే.. భవిష్యత్తులో గాంధీలో రోగులకు ఆక్సిజన్ కొరత ఉండదని అధికారులు తెలిపారు.