నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. ఎడపల్లి మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతున్నది. అయితే, మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో యువకులు, గుంపులుగా తిరుగుతూ, మాస్కులు ధరించకుండా కనిపిస్తున్నారు. మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ నిరుపయోగంగా మారడం, అక్కడకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో రాత్రంతా యువకులు సదరు ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఇలాంటి స్థలాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రెంజల్ మండలం కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు చేపట్టి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇండ్లకు పంపించారు. మండలంలోని సాటాపూర్ తెలంగాణ చౌరస్తా, రెంజల్ ప్రధాన కూడళ్లు జనం లేక నిర్మానుష్యంగా మారాయి. కోటగిరి మండలంలో లాక్డౌన్ వందశాతం అమలవుతున్నది. కోటగిరి ఇన్చార్జి ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని పొతంగల్, కోటగిరిలో లాక్డౌన్ను పర్యవేక్షించారు.
ఇందల్వాయిలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రజలు లాక్డౌన్ సమయంలో ఇండ్లలో నుంచి బయటికి రావొద్దని తహసీల్దార్ రమేశ్, ఎస్సై శివప్రసాద్రెడ్డి సూచిస్తున్నారు. మోపాల్లో ఎస్సై పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ తీరును పర్యవేక్షిస్తున్నారు. ధర్పల్లి ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో మండల కేంద్రం నిర్మానుష్యంగా మారుతున్నది. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించి కరోనా కట్టడికి సహకరించాలని ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. ఈమేరకు రోడ్లపై తిరుగుతున్న పలువురు యువకులను ఆయన మందలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. చందూర్లో లాక్డౌన్ కారణంగా కొవిడ్ బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సర్పంచ్ సాయారెడ్డి తెలిపారు. గ్రామంలో 124 మందికి కరోనా సోకగా ఇప్పటికే 95 మంది కోలుకున్నారని చెప్పారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు వారు కూడా కోలుకుంటారని పేర్కొన్నారు. మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.