మేడ్చల్, మే 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా సోకిన నిరుపేదలకు ఉచిత వైద్య సేవలందించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చింది. మల్లారెడ్డి కొవిడ్ కేర్ పేరిట హాస్పిటల్ సౌజన్యంతో సూరారంలో 300 బెడ్లను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించేలా ఐసొలేషన్ వసతి సౌకర్యం కల్పించనున్నది. ఈ సేవలు గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. స్వల్ప లక్షణాలు కలిగి కొవిడ్ పాజిటివ్ వచ్చిన 15ఏండ్ల నుంచి 60ఏండ్ల వయస్సు ఉన్న వారికి వైద్య సేవలు అందించనున్నారు. ఉచిత ఐసొలేషన్లో 24గంటల పాటు వైద్యులు, నర్సులను అందుబాటులో ఉంచి ఐసొలేషన్లో చికిత్స పొందే వారికి అవసరమైన వైద్యం అందజేస్తూ ఉచితంగా మందులు ఇవ్వనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజన సౌకర్యం కల్పించనున్నారు. అవసరమైతే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఐసొలేషన్ కేంద్రంలో వైద్యం పొందేవారి కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వైద్యం పొందేవారు ఐసీఎంఆర్ ఆమోదిత ల్యాబ్లు అందించే కరోనా టెస్టు రిపోర్టులను చేరే సమయంలో అందించాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఐసొలేషన్లో చేర్చుకుంటారని మల్లారెడ్డి కొవిడ్ కేర్ నిర్వాహకులు తెలిపారు. గుర్తింపు కోసం ఓటర్ లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచిస్తున్నారు. అవసరమైతే మరిన్ని ఐసొలేషన్ వసతి బెడ్లను పెంచుతామని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం ప్రజల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అవసరమున్న వారు హెల్ప్లైన్ నంబర్లు 95500 00993 – 96769 99872 లలో సంప్రదించాలి.
కరోనా పాజిటివ్ వచ్చి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సూరారంలో 300బెడ్లతో ఉచిత ఐసొలేషన్ వసతి సౌకర్యం కల్పిస్తున్నాం. మల్లారెడ్డి హాస్పిటల్ సహకారంతో మల్లారెడ్డి కొవిడ్ కేర్ పేరిట ఏర్పాటు చేశాం. గురువారం నుంచి కరోనా వైద్య సేవలను అందించనున్నాం. అవసరమైన వారికి ఉచితంగానే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి