మానవత్వాన్ని చాటిన సర్పంచులు
కరోనా విపత్కర పరిస్థితుల్లో చివరి మజిలీకి చిక్కులు తప్పడం లేదు. కరోనాబారిన పడిన వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు ముందుకు రాని బంధువులు.. అనారోగ్యంతో మృతి చెందిన వారి అంత్యక్రియలను సైతం నిర్వహించేందుకు భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు ఈ రెండు ఘటనలు అద్దం పడుతున్నాయి.
మోపాల్ మండలం న్యాల్కల్.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. మహమ్మారి తమలోని ఒకరిని బలితీసుకోవడంతో పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆ కుటుంబానికి సర్పంచ్, ఉప సర్పంచ్ అండగా నిలిచారు. సర్పంచ్ ప్రసాద్, ఉప సర్పంచ్ సతీశ్ పీపీఈ కిట్లు ధరించి శనివారం రాత్రి మృతుడి అంత్య క్రియలను గౌరవప్రదంగా నిర్వహించి మానవత్వాన్ని చాటారు. అయినవారు దగ్గరికి రాని ఈ సమయంలో బాధిత కుటుంబానికి ప్రజాప్రతినిధులు అండగా నిలువడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
– మోపాల్ (ఖలీల్వాడి), మే 9
మోస్రా మండలకేంద్రానికి.. చెందిన అంబం సాయిలు(52) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భయంతో బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో అంత్యక్రియలను నిర్వహించేందుకు సర్పంచ్ సుమలతారాంరెడ్డి ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ భర్త రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్కుమార్, రాము తదితరులు పీపీఈ కిట్లు ధరించి సాయిలు అంత్యక్రియలను నిర్వహించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన సర్పంచ్ కుటుంబసభ్యులతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బందికి మృతుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
– మోస్రా (చందూర్), మే 9