న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆక్సిజన్ రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లు వంటి వాహనాలకు టోల్ టాక్స్ను మినహాయించింది. జాతీయ రహదారులలోని టోల్ ప్లాజాల వద్ద ఈ వాహనాలు నిరంతరాయంగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తీసుకెళ్లే కంటైనర్లు, ట్యాంకర్లను అంబులెన్స్లు వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా పరిగణిస్తారు.
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్కు ఎనలేని డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు లేదా తదుపరి ఆదేశాల వరకు ఇది అమలులో ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.