నిడమనూరు, ఏప్రిల్ 4 : కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తాసీల్దార్ జి. నరసింహ వర్మరాజు కోరారు. మంగళవారం ఆయన పీహెచ్సీలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ మాధవ్ కుమార్ ఉన్నారు.
తండాల్లో మాస్కుల పంపిణీ
దామరచర్ల : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మాస్కులు ధరంచాలని మండలంలోని కేజేఆర్ కాలనీ సర్పంచ్ యమున అన్నారు. మంగళవారం తండాలో ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తండాలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంగమ్మ, రాంసింగ్, దస్రూ, పీక్యానాయక్ పాల్గొన్నారు.
ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో పొలాల వద్ద పనులు చేస్తున్న రైతులు, కూలీలకు బంజారా మహిళా ఎన్జీఓ సంస్థ చైర్మన్ డాక్టర్ అనంద్, స్వాతీ చంద్రన్ మంగళవారం మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ గోపాల్, సభ్యులు పాల్గొన్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని తక్కెళ్లపహాడ్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వీధుల్లో చెత్తను ఎత్తి డంపింగ్ యార్డులకు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చౌగాని భిక్షం గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని కొవిడ్ కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు.
కరోనాపై ప్రజలకు అవగాహన
దేవరకొండ రూరల్ : కరోనా ఉధృతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మాస్కులు తప్పక వినియోగించాలని వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్ కోరారు. మంగళవారం మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు పల్లెలకూ పాకిందని, నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకాలు తీసుకోవాలని సూచించారు.