మచిలీపట్నం, మే 4: రాష్ట్రంలో రెండవ దశ కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యే హడావిడిలో సైతం తన కార్యాలయం వద్దకు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు అక్కడి అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.
గతేడాది కాలంలో కోవిడ్ నివారణకు జిల్లాలో అనేక చర్యలు చేపట్టామని, ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైనట్లు గుర్తించాలని,ఆయన ప్రజలకు సూచించారు. మొదటి దశ కంటే ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని, అందుకోసమే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి పేర్ని నాని కోరారు.