రూ.15.69 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తీరనున్న రవాణా కష్టాలు
కరీమాబాద్, మే 2: రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులకు మహర్దశ రానుంది. అందులో భాగంగా ఫోర్టురోడ్డు నుంచి నాయుడు పంపు జంక్షన్ వరకు రోడ్డు పనులు జరుగనున్నాయి. స్మార్ట్ సిటీ నిధులతో ఇటీవల పనులకు సైతం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవతో రహదారికి పనులు ప్రారంభంకానున్నాయి. దీంతో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది.
డివైడర్ల నిర్మాణం, లైటింగ్ సౌకర్యం..
ఫోర్టురోడ్డు-నాయుడు పంపు జంక్షన్ అభివృద్ధి పనులకు 15.69 కోట్ల రూపాయలతో అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. నగరంలోని పలు గ్రామాలతోపాటు నగరానికి అనువుగా ఉన్న ఈ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు విస్తరణ, డివైడర్ల నిర్మాణంతోపాటు లైటింగ్ సౌకర్యం కల్పించనున్నారు.