అక్రమార్జనే ధ్యేయంగా ఆంధ్రా జాలర్లు
చేప విత్తనాలను కొల్లగొడుతున్న వైనం
నదిలో 46 లక్షల చేప విత్తనాలు విడుదల
దళారుల పాలవుతున్న చేపపిల్లలు
స్థానిక మత్స్యకారుల నిలువు దోపిడీ
పట్టించుకోని అధికార యంత్రాంగం
కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 25 : కొల్లాపూర్ సమీపంలో పారుతున్న కృష్ణానది తెలంగాణ, రాయలసీమ దళారులకు రూ. కోట్ల అక్రమార్జనను అందిస్తున్నది. చిన్నంబావి మండలంలోని పెద్దమారూర్, చిన్నమారూర్, బెక్కెం, గూడెం మొదలుకొని పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట, కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి మీదుగా పారుతున్న కృష్ణానది (శ్రీశైలం బ్యాక్వాటర్) పొడవునా శ్రీశైలం దాకా ఇరువైపులా గట్లమీద వేల మత్స్యకార కుటుంబాలు ఇండ్లు, గుడిసెలు, తాత్కాలిక షెడ్లు వేసుకుని నిత్యం చేపల షికారుచేస్తుంటారు. ఎక్కువగా భైరవకోన సమీపంలో అక్రమ చేపలవేట సాగుతుందని ఆరోపణలున్నాయి. మత్స్యకారుల అవసరాలను ఆసరాగా చేసుకొని దళారీలు కొంత అడ్వాన్స్ ముట్టజెప్పి పట్టిన చేపలను తమకే వేయాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందం మేరకు పట్టిన చేపలను తక్కువ ధరకు షావుకార్లకు వేస్తుంటారు. ఇంజన్బోటు ద్వారా వ్యాపారులు తమవద్దకు వచ్చి చేపలను తీసుకెళ్లి రెట్టింపు ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
పలు రాష్ర్టాల్లో బాయిలర్ కోళ్ల మాంసానికి డిమాండ్ ఉండడంతో కోళ్ల పెంపకానికి ఎండు చేపలమిశ్రమం ప్రధాన ఆహారంగా మారింది. కోళ్ల పరిశ్రమకు వేసే దాణాలో ఎండుచేపల పొడి వాడుతుండడంతో దళారులు రెండుచేతులా ఆర్జిస్తున్నారు. దీంతో అక్రమార్కులు చిన్న చేపలను సైతం అలవి వలలతో పట్టి ఇతర రాష్ర్టాలకు దాటిస్తూ రూ.కోట ్లదందా చేస్తున్నారు. కృష్ణానది నుంచి మొదలుకొని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల ద్వారా అక్రమవ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. దీంతో స్థానిక మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కుంటుపడుతున్నది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం కావడమేగాక సీఎం కేసీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.
అలవి వలలతో మాయం
ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేసి కోట్లాది చేపవిత్తనాలను (శ్రీశైలం బ్యాక్వాటర్) కృష్ణానదిలో వదులుతోంది. అవి పెరిగేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ కొందరు దళారీ వ్యాపారులు ఒకేసారి టన్నుల కొద్దీ చేపలను పట్టేందుకు అలవి వలలను ఉపయోగిస్తున్నారు. దీంతో చేపవిత్తనాలు పూర్తిగా అలవి వల ద్వారా బయటికి వస్తాయి. వాటిని వేరు చేసి ఎండపెట్టి అమ్ముకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎండుచేపలకు ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే కోళ్ల పరిశ్రమలకు కూడా వీటి తరలింపు అధికంగా సాగుతోంది. నెలలో కనీసం రెండు లేక మూడుమార్లు అలవి వలలను ఉపయోగిస్తుండడంతో నదిలో చేపసంపద క్షీణిస్తోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
429 మత్స్యకార కుటుంబాలు
సోమశిల సమీపంలోని కృష్ణానది పరిధిలో 429 మత్స్యకార కుటుంబాలతో సహకార సంఘం ఉంది. కృష్ణానదిలో భాగంగా 190మందితో గుమ్మడం సొసైటీని ఏర్పాటు చేశారు. కాగా కృష్ణానది పొడవునా 40 పట్టువలలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏటా సోమశిలలో 30లక్షలు, గుమ్మడం పరిధిలో 16లక్షల చేప విత్తనాలు వదులుతారు. కానీ, నిషేధిత వలలతో చేప సంపద అక్రమార్కుల పాలవుతుంది.
పట్టువలతో పెద్దచేపలు హాంఫట్
వలల్లో రకాలుంటాయి. పెద్దచేపలు పట్టేది. చేప విత్తనాలతో సహా పెద్దవి పట్టే వల. సాధారణ వలలు. చిన్న పడవల్లో నదిలో వల వేసి మరుసటిరోజు వలకు చిక్కిన చేపలను తీసుకొచ్చి అమ్ముకుంటారు. కానీ కొందరు వ్యాపారులు పట్టువల ఉపయోగించి టన్నుల కొద్దీ చేపలను తీసి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పట్టువల, అలవి వలలు నదిలో వేసేందుకు, తీసేందుకు 30 నుంచి 40మంది వరకు అవసరముంటుంది. రోజు కూలీ ఇచ్చి వచ్చిన టన్నుల చేపలను హైదరాబాద్కు తరలిస్తున్నారు.
పొంచివున్న తిమింగలాలు
నదీతీరం వెంట దళారీలు నిత్యం మాటువేసి చిన్న చిన్న మత్స్యకార కుటుంబాల అవసరాల మేరకు గాలం వేసి అక్రమ వ్యాపారం సజావుగా కొనసాగిస్తున్నారు. నిత్యం ఇంజన్బోటు తీసుకొని తీరం వెంట ఉండే మత్స్యకారుల వద్దకు వెళ్లి పట్టి ఉంచిన చేపలను బోటులో వేసుకొస్తారు. వాటిని సైజుల వారీగా వేరు చేసి ఐస్ గంపల్లో నింపి సీల్వేస్తారు. రెండు రోజులకోసారి డిమాండ్ ఉన్న ప్రాంతాల మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. వేరుచేసిన చిన్నచేపలను ఎండబెట్టి టన్నుల కొలదీ లారీల్లో రవాణా చేస్తుంటారు. జలసిరులతో దళారీ వ్యాపారానికి కృష్ణానదిలో బలమైన పునాదులు పడుతున్నాయి.
మామూళ్లు అందుతాయిలా..
రూ.కోట్ల వ్యయంతో వేల టన్నుల చేప విత్తనాలను నదిలో జారవిడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని దళారులు వారికి అండగా ఉన్న సంబంధిత అధికారులు నిలువునా మోసం చేస్తున్నారు. నదిలో చేపలు ఒకేసారి టన్నుల్లో పట్టుకోవాలంటే అలవి, పట్టువలలను ఉపయోగించాలి. వాటిని వాడుతున్నప్పుడు దళారులు అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తుంటారు. అంతకుముందే చేసుకున్న ఒప్పందంతో వారికి చేరాల్సినవి చేరుతాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు, ఫారెస్టు అధికారులు, ఇటు రెవెన్యూ సిబ్బందైనా సరే వారిలో ఒకరిచేత సమాచారం ఇప్పిస్తుంటారు. దీంతో ఫిర్యాదుల మేరకు అధికారులు నదీతీరం వరకు వెళ్లే సరికి అక్కడ చేపలు పట్టే ఆనవాళ్లు కూడా కనిపించవు.
పట్టువల గుంజేందుకు వెళ్లి మృత్యువాత
ఏటా సోమశిల, అమరగిరి, మల్లేశ్వరం, గుండ్ల పెంట్ల సమీపంలోని భైరవకోన వద్ద పట్టువల, అలవి వలను నదిలో జారవిడిచే ముందు సమీపంలోని దేవుడికి టెంకాయ కొట్టే సంప్రదాయం. ఈ మేరకు సోమశిల నది ఆవలి ఒడ్డున జానాలఅనే కుగ్రామం సమీపంలో తాతయ్య ఆలయం ఉంది. కొన్నిరోజుల కిందట ఓ యువకుడు ఆలయం వద్దకు వెళ్లి నదిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. దీంతో గ్రామంలో, నదీతీరం వెంట ఉన్న జాలర్ల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.