గ్రేటర్లో కరోనా విజృంభిస్తుండడంతో కట్టడి చేసేందుకు మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) చర్యలను ఉధృతం చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. 30 సర్కిళ్ల పరిధిలో 63 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ గురువారం ప్రకటించారు. గతేడాది మాదిరిగానే ఈ జోన్లలో నిత్యం రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం, ప్రజలు గడప దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. తొలుత ఇంటింటి సర్వే నిర్వహించి వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్పత్రికి, స్వల్పంగా ఉంటే ఐసొలేషన్కు తరలిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సమయంలో తరలిం చేందుకు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుతారు.
గ్రేటర్లో అధికశాతం చార్మినార్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేస్తున్నాం. డీఆర్ఎఫ్, ఎంటమాలజీ విభాగం సంయుక్తాధ్వర్యంలో నిత్యం 16 వేల ఇండ్లను కవర్ చేస్తూ 400 నుంచి 500 లీటర్ల ద్రావణాన్ని వినియోగిస్తున్నాం. -రాంబాబు, బల్దియా ఎంటమాలజీ చీఫ్
గ్రేటర్లో కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నది. ఇంటిల్లిపాదినీ కరోనా పాలు చేసి కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ను నిలువరించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా వచ్చిన 63 ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్ క్లస్టర్లుగా గురువారం ప్రకటించారు. నిరుడు మాదిరిగానే పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే దిశగా చర్యలు ప్రారంభించారు. కంటైన్మెంట్ జోన్లలో రోజూ రెండు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం, ప్రజలను గడప దాటకుండా బారికేడ్లు ఏర్పాటుచేయడం లాంటి చర్యలు చేపడుతారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. సామాజిక దూరం పాటిస్తూనే చుట్టు పక్కల ఉన్న వారితో జీవనం సాగించాల్సి ఉంటుంది. నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, మెడికల్ ఇతర సౌకర్యాలు అధికారులు సమకూర్చనున్నారు. ప్రతి జోన్ పరిధిలోని నివాసితులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి వారి అవసరాల మేరకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పలు మందులు ఇండ్ల వద్దకే సరఫరా చేయనున్నారు. వైద్యఆరోగ్య, పోలీస్, జలమండలి అధికారులు సమన్వయం చేసుకోనున్నాయి. 104, 108 వాహనాలతో పాటు ప్రైవేట్ అంబులెన్స్ల సేవలను అందుబాటులో ఉంచనున్నారు.