చౌటుప్పల్ పైలట్లో సూపర్ సక్సెస్
సీహెచ్సీతోపాటు మరో మూడు మొబైల్ టీమ్లు..
ప్రతిరోజూ 1500 మందికి వ్యాక్సినేషన్
45 ఏండ్లు పైబడిన వారు 19,500…
ఇప్పటివరకు 15, 262 మందికి వ్యాక్సిన్ పూర్తి
మరో రెండు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం
మండల వైద్యాధికారి డా. శివప్రసాద్రెడ్డి
చౌటుప్పల్, ఏప్రిల్ 22 : కరోనా రక్కసి సెకండ్ వేవ్లో కోరలు చాస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వం వ్యాక్సినేషన్ను వేగవంతం చేసింది. ముందుగా 45 ఏండ్ల పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ మేరకు జిల్లాను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జిల్లాలో చౌటుప్పల్ మండలాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. చౌటుప్పల్ సీహెచ్సీతోపాటు, మరో మూడు మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడిన వారు 19,500 మంది ఉండగా, నెలాఖరులోగా టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రతిరోజూ సుమారు 1500 మందికి టీకాలు వేస్తూ, ఇప్పటి వరకు 15,262 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తుండటంతో వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని ఈ నెల 25 వరకే కుదించారు. అయినప్పటికీ మరో రెండు రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని మండల వైద్యాధికారి డా. శివప్రసాద్రెడ్డి ధీమాగా తెలిపారు.
కరోనా రక్కసి కోరలు చాచి ఎంతో మందిని బలిగొంటుంది. ఇండ్ల నుంచి కాలు కదిపేందుకు జంకాల్సిన పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ముందు కరోనా వారియర్స్కు అంటే పారిశుధ్య, వైద్య, ఆరోగ్య సిబ్బంది, జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వేసింది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వాక్సినేషన్ వేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ప్రభుత్వ ఆదేశంతో జిల్లాలో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేశారు. చౌటుప్పల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకుని మండల వైద్యాధికారి డా. శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చౌటుప్పల్ సీహెచ్సీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. చౌటుప్పల్ సీహెచ్సీ టీమ్తో పాటు మరో 3 మొబైల్ టీమ్లు ఇప్పటి వరకు 15,262 మందికి టీకాలు వేశారు.
లక్ష్యానికి చేరువలో…
వ్యాక్సినేషన్ వేసేందుకు జిల్లాలో ఏప్రిల్ 7న చౌటుప్పల్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలం, మున్సిపాలిటీ కలి పి 45ఏండ్లు దాటిన 19,500 మందికి వ్యాక్సినేషన్ వేయడం లక్ష్యంగా నిర్ధారించారు. మొదట ఈ నెలాఖరు వరకు గడువివ్వగా..ఇక్కడ సిబ్బంది పనితీరును చూసి 25 వరకు కుదించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మండల వైద్యాధికారి డా. శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రణాళికలు రూపొందించారు. ఒక పక్క చౌటుప్పల్ సీహెచ్సీలో వేస్తూనే, మరోపక్క గ్రామాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఇందుకు సీహెచ్సీ, 3 మొబైల్ టీమ్లను ఏర్పాటు చేశారు. నిత్యం సుమారు 1400 నుంచి 1500 మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కేవలం 15 రోజుల్లో 15,262మందికి వాక్సినేషన్ చేశారు. 13 రోజుల్లోనే 80శాతం లక్ష్యం పూర్తి చేయగా..మరో రెండు, మూడు రోజుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంటామని మండల వైద్యాధికారి డా. శివప్రసాద్రెడ్డి తెలిపారు.
రికార్డు స్థాయిలో..
చౌటుప్పల్ సీహెచ్సీ వ్యాక్సినేషన్లో రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధిస్తుంది. ప్రతిరోజూ 1500 మందికి తగ్గకుండా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ నెల 16న 2,042 మందికి వ్యాక్సినేషన్ వేసి రికార్డు సాధించారు. రాష్ట్రంలో ఏ మండలంలోనూ ఒక్క రోజులో ఇంత మందికి వ్యాక్సిన్ వేయలేదని, ఇది రికార్డని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపినట్టుగా మండల వైద్యాధికారి వివరించారు.