పారిశుధ్య నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని బల్దియా ఎంత మాత్రమూ సహించడం లేదు. మంగళవారం ముషీరాబాద్లో ఎస్ఎఫ్ఏను తొలగించిన మేయర్ బుధవారం పర్యటనలో శ్రీనగర్ కాలనీ ఎస్ఎఫ్ఏ సాయిబాబాపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ జోన్లోని పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీలో ఇద్దరు పారిశుధ్య కార్మికులు 18 నెలలుగా పనికి రాకున్నా నెలకు రూ.15 వేలు తీసుకుంటూ.. అందులో వారి పేరిట డ్రా చేస్తున్నందున నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నట్లు మేయర్ దృష్టికి వచ్చింది. దీంతో అవకతవకలకు పాల్పడిన సాయిబాబాను తొలగించాలని మెడికల్ ఆఫీసర్ రవికాంత్కు ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు శ్రీనగర్ కాలనీలో స్థానికులతో మేయర్ మాట్లాడారు. రోడ్డు మీద చెత్త వేయవద్దని.. ఆటోలకు ఇవ్వాలని సూచించారు. శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు.
కూకట్పల్లి జోన్లోని మూసాపేట, భరత్నగర్, గూడ్స్ రోడ్, అల్లాపూర్లోని రాజీవ్ గాంధీనగర్ , కూకట్పల్లి, వెంకటరమణ కాలనీలను సందర్శించిన మేయర్.. గూడ్స్ రోడ్డులోని ఫాతిమా గౌడౌన్ ఎదురుగా నాలా వద్ద ఉన్న తుక్కు దుకాణంలో వైద్య వ్యర్థాలను చూసి షాక్ అయ్యారు. ఆరు నెలల నుంచి మెడికల్ వేస్ట్ అక్కడే ఉందని స్థానికులు చెప్పడంతో సంబంధిత షాపునకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. విస్డమ్ హైస్కూల్ రోడ్డులో నాలా వద్ద పేరుకుపోయిన చెత్తను చూసి అగ్రహం వ్యక్తం చేశారు. పాత రాజీవ్ గాంధీనగర్ వార్డు ఆఫీసు బస్తీ దవాఖానగా మారిందని, దాని పక్కనే చెత్త డంప్ చేయడంతో అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ ఇక్కడ చెత్త వేయకుండా చూడాలన్నారు.