వైద్యం కోసం నైజీరియా నుంచి భారత దేశానికి వచ్చాడు. ఫుట్బాల్ కోచ్ శిక్షణ ఇస్తున్నాడు. సైబర్ మోసాలకు పాల్పడే వారితో పరిచయం పెంచుకొని నేరాలకు పాల్పడుతున్నాడు. ఏకంగా యూకే కరెన్సీ పంపిస్తున్నానని నమ్మించి ఓ బాధితుడి నుంచి రూ.18 లక్షలు కొట్టేశాడు. 4 నెలల పాటు దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నైజీరియన్ సైబర్ మోసగాడితో పాటు అతడికి సహకరించిన ఆటో డ్రైవర్ను శనివారం అరెస్టు చేశారు. నైజీరియా దేశానికి చెందిన హెన్రి చుక్వి ఒపెరా కొన్ని సంవత్సరాల కిందట వైద్య సేవల కోసమని వీసా సంపాదించుకుని ఇండియాకు వచ్చాడు.అనంతరం కర్నాటకకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత న్యూఢిల్లీలో ఉంటున్నాడు. అక్కడ పుట్బాల్ కోచ్గా పని చేస్తున్నాడు. దీంతో గ్రౌండ్లో ఉన్నప్పుడు అతనికి చీమా ఫ్రాంక్, ముగశియెప్తో పరిచయమయ్యారు. వారు చేసే సైబర్ మోసాలకు గురించి తెలుసుకున్నాడు.
ఆ తర్వాత వారితో కలిసి సైబర్ నేరాలకు పాల్పడడానికి సిద్ధమయ్యాడు. సొంతంగా సైబర్ క్రైం చేయాలనే ఆలోచనతో సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత అతనికి భారీగా యూకే కరెన్సీ పంపిస్తానని నమ్మించి తర్వాత కస్టమ్స్ అధికారులుగా ఫోన్లు చేసి బాధితుడిని బయపెట్టి దాదాపు రూ.18 లక్షలను కాజేశాడు. ఈ మోసంపై బాధితుడు గత ఏడాది డిసెంబరులో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుడు ఆన్లైన్లో పంపిన బ్యాంక్ ఖాతాల వివరాలు ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు హెన్రి చుక్వి ఒపెరాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేశారు.