ముంబై : దేశ ఆర్థిక రాజధానిని మరోసారి కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో మహమ్మారి కట్టడికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పలు చర్యలు చేపడుతోంది. నగరంలోని కొన్ని ఫోర్ స్టార్, ఫైవ్స్టార్ హోటళ్లను కొవిడ్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించింది. వీటితో పాటు ముంబైలో నూతనంగా మూడు జంబో ఫీల్డ్ దవాఖానాలను నెలకొల్పనుంది.
కరోనా వైరస్ సోకిన రోగుల కోసం ముంబైతో పాటు నగర శివార్లలోని స్టార్ హోటళ్లు కొన్నింటిని కొవిడ్ సెంటర్లుగా మలిచేందుకు చర్యలు చేపట్టామని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ తెలిపారు. ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వైద్య వృత్తి నిపుణులు వీటిని నిర్వహిస్తారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న రోగులను కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఈ సెంటర్లకు తరలిస్తామని వెల్లడించారు. ఇక 2000 పడకలతో 200 ఐసీయూ పడకలతో కూడిన మూడు జంబో దవాఖానలను ముంబైలోని వివిధ ప్రాందాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు.