జవహర్నగర్, ఏప్రిల్ 11 : ‘ఇచ్చిన మాట, చేసిన వాగ్దానాన్ని ఎప్పటికీ మరువను. నేటి నుంచి ఏడాదిలోపు జవహర్నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా..’ అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జవహర్నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డితో కలిసి రూ.8.20కోట్లతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి, సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్నగర్ నా గుండె కాయ అన్నారు. ఈ ప్రాంతంలో ఏడాదిలోపు రోడ్లు, డ్రైనేజీలతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి జిగేల్ మనిపించేలా తీర్చిదిద్దుతానని తెలిపారు. పేద ప్రజలు నివాసముండే జవహర్నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు సరైన ఆదాయం లేకపోవడంతో అభివృద్ధి చేయలేకపోయామని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. దీంతో వారు వెంటనే స్పందించి ప్రధాన రోడ్డుతో పాటు ఇతర అభివృద్ధి పనులకు రూ.8.20 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
చెన్నాపురం చౌరస్తా నుంచి వికలాంగుల కాలనీ డబుల్ బెడ్రూంల వరకు రూ.1.20 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను, రూ.3 కోట్ల వ్యయంతో డ్రైనేజీ, రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్పొరేషన్లోని 8వేల కుటుంబాలకు ప్రతి రోజు నీరు అందించేలా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ను అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడి మరో రూ.20 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రెండెకరాల్లో మోడల్ మార్కెట్ నిర్మించేందుకు రూ.4కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1, 2022 వరకు జవహర్నగర్లో సకల వసతులు కల్పిస్తామని ఇక్కడి ప్రజలకు మాట ఇస్తున్నానని.. ఇచ్చిన మాట తప్పనని మరోమారు నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అడగ్గానే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు జవహర్నగర్ వాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జవహర్నగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వామినైనందుకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జవహర్నగర్ అభివృద్ధి కోసం మంత్రి మల్లారెడ్డి అనునిత్యం తపిస్తూనే ఉంటారన్నారు. అత్యధికంగా పేద ప్రజలు నివాసముంటున్న ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కోరినట్లు తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ధికోసం తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ కృష్ణ, మేనేజర్ నగేశ్బాబుతో పాటు జిల్లా టీఆర్ఎస్ నాయకులు మేకల అయ్యప్ప, డాక్టర్ రాజశేఖర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు వల్లూరి ఇందిర, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్న బాల్రాజ్ పటేల్, కోనేరు భాస్కర్, ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్ గుప్తా, ఏకే మురుగేశ్, ఉపాధ్యక్షుడు పిన్నోజు సుధాకర్ చారి, కోశాధికారి అశోక్, మహ్మద్ సాధిక్, యూత్ అధ్యక్షుడు మేకల భార్గవ రామ్లతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.