స్వరాష్ట్రంలో తీరుతున్న ‘అంతిమ’ కష్టాలు
ప్రతి గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణం
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఒక్కో వైకుంఠధామానికి రూ.12.60 లక్షలు
సాగర్ నియోజకవర్గంలో 179.. రూ.22.50 కోట్లు కేటాయింపు
హాలియా, ఏప్రిల్9 : ఉన్నవాడైనా, పేదవాడైనా చనిపోతే అంతిమ సంస్కారానికి కావాల్సింది ఆరు అడుగుల స్థలమే. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పేదోళ్లకు ఆ స్థలం లేక వాగులు, వంకలు, చెరువుగట్లే దిక్కయ్యేవి. ఒక వ్యక్తి చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి చాలా ఇబ్బందులయ్యేవి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఆ కష్టాలు తీరుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, పట్టణాల్లో ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని హంగులతో అందుబాటులోకి తెస్తున్నారు.
పట్టణ, పల్లె ప్రగతితో..
గతంలో అంత్యక్రియలకు స్థలం, స్నానాల గదులు, నీటి సౌకర్యం లేకపోవడం వంటి ఇబ్బందులున్నాయి. ప్రజల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ వైకుంఠధామాలు నిర్మించాలని సంకల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో వీటిని అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ఇందుకోసం పట్టణ, పల్లె ప్రగతి ద్వారా పనులు చేపడుతున్నారు. ఒక్కో వైకుంఠధామానికి ప్రభుత్వం రూ.12.60 లక్షలు వెచ్చిస్తున్నది. వైకుంఠధామంలో ఒక ఆర్చి, రెండు బర్నింగ్ ప్లాట్ఫారాలు, స్నానాల రూము, టాయిలెట్ నిర్మిస్తున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 179
నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కొన్నిచోట్ల మాత్రమే శ్మశానవాటికలు ఉండేవి. అవి కూడా సామాజికవర్గాల వారీగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికోసం గ్రామాలు, పట్టణాల వారీగా వైకుంఠధామాలు నిర్మిస్తున్నది. ఇందుకోసం స్థలం కూడా కేటాయించింది. సాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 179 వైకుంఠధామాలను రూ.22.55 కోట్లతో సర్కారు నిర్మిస్తుండగా ఇందులో దాదాపు సగానికిపైగా పూర్తయ్యాయి. పచ్చని చెట్లు, పూల మొక్కలతో వీటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గతంలో కంపచెట్లు, బురదమయమైన ప్రదేశాల్లో అంత్యక్రియలు నిర్వహించి ఇబ్బందిపడ్డ ప్రజలు వీటిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం