పల్లె ప్రగతి పనుల్లో ముందంజ
గ్రామస్తులకు మౌలిక వసతులు
ప్రభుత్వ లక్ష్యాలకు చేరువగా..
ఇతర పంచాయతీలకూ ఆదర్శం
కామేపల్లి ఏప్రిల్ 9: మద్దులపల్లి గ్రామం ఒకప్పుడు అరకొర వసతులతో అధ్వానంగా ఉండేది.. వీధుల్లోనే మురుగు పారేది.. పెచ్చులు లేచి దారులు అస్తవ్యస్తంగా ఉండేవి.. సరైన వసతులు లేని శ్మశాన వాటికతో గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. గ్రామస్తుడు ఎవరైనా చనిపోతే కనాకష్టం మీద అంతిమ సంస్కారాలు నిర్వహించేవారు.. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పల్లె రూపురేఖలే మారిపోయాయి. ‘పల్లె ప్రగతి’ పనుల్లో భాగంగా పంచాయతీ ప్రగతి బాట పట్టింది.. ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డుతో కళకళలాడుతున్నది.. ఈ నేపథ్యంలో గ్రామాభివృద్ధిపై ప్రత్యేక కథనం.
ఒక్కప్పుడు మద్దులపల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. సమస్యల వలయంలో గ్రామస్తులు గోస పడేవారు. అప్పటి ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై ఆసక్తి చూపకపోవడంతో పల్లె వెనుకబాటులోనే ఉండేది. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత నిధులు పుష్కలంగా విడుదల కావడంతో పాలకవర్గ సభ్యులు గ్రామాన్ని ప్రగతి బాట పట్టించారు. పల్లె ప్రగతి లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రజాసమస్యలకు పరిష్కారం చూపుతూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నారు.
పచ్చందాలతో కళకళ
పంచాయతీ జనాభా 2,870 కాగా 745 గృహాలు ఉన్నాయి. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు పూర్తయి పల్లెకు కొత్త కళను తీసుకువచ్చాయి. ప్రకృతి వనంలోని మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో నిర్మించిన రైతువేదిక రైతులకు చర్చావేదికగా మారింది. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డు పక్కన మొక్కలు పెరుగుతున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంతో అవి చక్కగా పెరుగుతున్నాయి. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పంచాయతీ సిబ్బంది గ్రామంలో పాడుబడిన నాలుగు బావులను పూడ్చేశారు. శిథిల భవనాలను నేలమట్టం చేశారు. ఇళ్లపైకి వేలాడుతున్న విద్యుత్ తీగలను సవరించారు. వీధి స్తంభాలకు విద్యుత్ దీపాలు బిగించారు. పారిశుధ్య నిర్వహణను పక్కాగా చేపడుతున్నారు. గ్రామస్తుల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు.
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం పూర్తి..
పల్లె ప్రకృతి వనంలో 4 వేల మొక్కలు, శ్మశాన వాటికలో 400 మొక్కలు పెరుగుతున్నాయి. రూ.9.50 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ సమకూరాయి. 535 ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరింది. రూ.22 లక్షలతో వీధి వీధికి సీసీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణ పక్కా ఉండడంతో గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలుస్తున్నది.
అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం..
పల్లె ప్రకృతి పనులు, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేశాం. పంచాయతీని మండలంలో ముందంజలో నిలిపాం. పంచాయతీ పాలకవర్గం సభ్యులందరి సహకారం, గ్రామస్తుల తోడ్పాటుతో అభివృద్ధికి బాటలు వేశాం. ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీ నిధులు సమకూరుస్తున్నది. నిధులకు ఢోకా లేదు. ప్రస్తుతం నిలిచిన పనులను కూడా పూర్తి చేస్తున్నాం.
-పులసం జయమ్మ, సర్పంచ్, మద్దులపల్లి
ఇవి కూడా చదవండి
కోహ్లి, మ్యాక్స్వెల్ అవుట్.. కష్టాల్లో బెంగళూరు
కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటు
ఒంటిమిట్టలో 26న కోదండ రాముడి కల్యాణం