వందేండ్ల గండిపేట సరికొత్త సొబగులద్దుకుంటున్నది. సందర్శకుల మదిని దోచేలా జలాశయ తీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 1920లో నిర్మించిన ఉస్మాన్సాగర్ 2020 నాటికి వందేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే గండిపేట తీరాన్ని అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చాలని సంకల్పించిన సర్కారు.. రూ.100కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏకు బాధ్యతలను అప్పగించింది.
గండిపేట రిజర్వాయర్ను టూరిస్ట్ హబ్గా మార్చేందుకు హెచ్ఎండీఏ రూ. 100కోట్లతో సుందరీకరణ పనులకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తొలి విడతగా జలమండలి ద్వారక పార్కుకు ఆనుకొని ఉన్న 18 ఎకరాల విస్తీర్ణంలో రూ. 35.60కోట్లతో ల్యాండ్ స్కేప్ పార్కు పనులకు శ్రీకారం చుట్టింది. కరోనాతో పనుల్లో కొంత ఆలస్యం జరిగినా.. మళ్లీ సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి క్షేత్రస్థాయిలో గండిపేట పార్కు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కిడ్స్ ప్లే ఏరియా, పబ్లిక్ ఏరినా విత్ వాటర్ ఫ్రంట్ లైన్ డెవలప్మెంట్, హంపీ థియేటర్స్, బోర్డు వాక్, వివింగ్ డక్స్ అండ్ జెట్టీస్, ఫుడ్ కోర్టులు, స్కేటింగ్ జోన్, సైకిల్ ట్రాక్స్, వాక్వే, టెర్రస్ గార్డెన్స్, పిక్నిక్ స్పేస్, ఔట్ డోర్ జిమ్, ఆర్ట్ పవిలైన్స్, ఎంట్రన్స్ పవిలైన్ విత్ వాచ్ అండ్ వార్డ్ రూమ్, ఎంట్రన్స్ ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు అభివృద్ధి పనులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ఐటీ రంగం అభివృద్ధితో మహానగరం పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తున్నది. ఐటీ కారిడార్లోని ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట ,నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాలకు సమీపంలోనే గండిపేట జలాశయం ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలో గండిపేట కింద భాగంలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి. ఐటీ రంగంతో పాటు సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారికి గండిపేట చుట్టు పక్కల ప్రాంతాలు నివాస కేంద్రాలుగా మారాయి. దీంతో జంటనగరాల్లో హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నది. నగరంలో కాలుష్య రహితంగా, ప్రశాంతమైన జీవనం కొనసాగించేందుకు వీలుగా కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ఉండటంతో భారీ సంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలు గండిపేట సమీపంలో వస్తున్నాయి.
నిజాం నవాబుల కాలంలో మూసీ వరద నేపథ్యంలో 1920లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ నదిపై గండిపేట సమీపంలో ఉస్మాన్ సాగర్( గండిపేట చెరువు)ను నిర్మించారు. నగరాన్ని వర్షాకాల వరదల నుంచి కాపాడేందుకు, నగర వాసులకు తాగునీటి కోసం ఈ జలాశయాన్ని అప్పటి ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధునిక ఇంజినీరింగ్ నైపుణ్యంతో గండిపేట జలాశయాన్ని అద్భుతంగా నిర్మించారు.