రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరెల తయారీకి వినియోగించే నూలు కొనుగోలు చిన్న తరహా పరిశ్రమల ఆసాములకు భారమైపోతున్నది. నాలుగైదు సాంచాలు పెట్టుకుని ఉపాధి పొందే ఆసాములు ముందస్తుగా నూలు కోసం పెట్టుబడి పెట్టే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. నూలు కొనుగోలు చేసి చీరెలు తయారు చేసిన తర్వాతనే సర్కారు పైసలు చెల్లిస్తుండగా, ఇక నుంచి ఆ బాధలు తీరనున్నాయి. ఆ భారం మోయలేని ఆసాములంతా మంత్రి కేటీఆర్కు మొరపెట్టుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్లలో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేస్తానని అమాత్యుడు హామీ ఇవ్వడమే కాదు, వన్టైం సపోర్టు పథకం నేటి నుంచే అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
మార్గదర్శకాలు జారీ..
వన్టైం సపోర్టు పథకం అమలుకు బుధవారం చేనేత జౌళిశాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. యజమానులపై ఆధారపడకుండా 100 డాబీలు గల మాక్స్ సంఘాలు, 50 డాబీల మరమగ్గాలున్న ఎస్ఎస్ఐ యూనిట్లు ఈ పథకం పరిధిలోకి వచ్చే విధంగా మార్గదర్శకాలు ఇచ్చింది. బతుకమ్మ చీరలకు ఎంత నూలు అవసరమో, ఏ కంపెనీకి ఆర్డర్లు పెట్టాలో ఆసామి ముందుగా చేనేత జౌళిశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. వారు వెంటనే టెస్కో సంస్థకు నివేదిస్తారు. టెస్కో సంస్థ ముందస్తుగా స్పిన్నింగ్ మిల్లులకు డబ్బులు చెల్లిస్తుంది. చీరలు తయారైన తర్వాత ఆసాములకు నూలుకు సంబంధించి డబ్బులు మినహాయించుకుని ఆ సాములకు నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. బతుకమ్మ చీరలకు అవసరమయ్యే నూలు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారు. ముందుగా డీడీలు చెల్లిస్తేగాని సంస్థలు నూలు సరఫరా చేయని పరిస్థితి. ఇలా ఆసాములకు నూలు కొనుగోలు రూ.లక్షల్లో భారం పడకుండా ప్రభుత్వం చేయూత నిస్తున్నందుకు ఆసాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సారుకు రుణపడి ఉంటాం..
గత పాలకుల సవతి ప్రేమతో తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయిన సాంచాల పరిశ్రమ నేడు అభివృద్ధిలో రెండో షోలాపూర్గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సర్కారు వచ్చినంకనే సిరిసిల్ల సాంచాలకు మంచిరోజులు వచ్చినయ్. కూలీ గిట్టుబాటైత లేదంటే పదిశాతం యార్న్ సబ్పిడీ ఇచ్చింది. వన్టైం సపోర్టు పథకం ద్వారా ఆసాములకు నూలు కొనుగోలు చేసి ఇస్తున్నందుకు చాలా సంతోషం. కేవలం సిరిసిల్ల కోసం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకున్నందుకు ఆసాములు, కార్మికులందరం రుణపడి ఉంటం.
నేటి నుంచే అమల్లోకి..
సర్కారు తెచ్చిన వన్టైం సపోర్టు పథకం నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ఇందుకు మార్గదర్శకాలు వచ్చాయి. ఈ పథకంలో భాగంగా యజమానులపై ఆధారపడని 100 డాబీల మరమగ్గాల మ్యాక్స్ సంఘాలు, 50 డాబీలున్న ఎస్ఎస్ఐ యూనిట్లుకు మాత్రమే వర్తిస్తుంది. నూలు కొనుగోలు చేయాలంటే రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఇది చిన్నపాటి ఆసాములకు భారమే. మంత్రి చొరవతోనే ఇది సాధ్యపడింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో మరమగ్గాల పరిశ్రమలకు అమలు చేయడం గర్వించ దగ్గ విషయం.