న్యూఢిల్లీ: లోన్ చెల్లించేందుకు డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి రూ.15 వేలు తీసుకున్నాడు. మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి ఆమె మాజీ ప్రియుడని దర్యాప్తులో తేలింది. పాత ఢిల్లీలో నివాసం ఉండే శుభం శర్మ తీసుకున్న లోన్ చెల్లించలేకపోయాడు. దీంతో మాజీ ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేయాలని నిర్ణయించాడు. ఆమె ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. నకిలీ ఐడీ కార్డుతో మొబైల్ సిమ్ సమకూర్చుకున్నాడు. మాజీ ప్రియురాలికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.
భయపడిన ఆమె తొలుత రూ.15,000 ఇచ్చింది. మరోసారి డబ్బుల కోసం అతడు బ్లాక్మెయిల్ చేయడంతో సీమాపురి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ నుంచి నిందితుడి ఐపీ అడ్రస్ వివరాలు సేకరించారు. నకిలీ ఐడీతో సిమ్ తీసుకున్న మొబైల్ నంబర్ను గుర్తించారు.
వర్చువల్ నంబర్ ద్వారా ఆ మహిళను మరోసారి రూ.15,000 వేలు డిమాండ్ చేస్తుండగా సైబర్ సెల్ పోలీసులు అతడి లొకేషన్ను ట్రేస్ చేశారు. అతడ్ని అరెస్ట్ చేయగా ఆ మహిళ మాజీ ప్రియుడు శుభం శర్మగా తేలింది. పోలీసులు ప్రశ్నించగా ఆమె ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు.