హైదరాబాద్ : కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు నీటిని తరలించడం అద్భుత చరిత్రకు నాందిగా ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు.
హల్దీ వాగులోకి సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నదికి సీఎం కేసీఆర్ సరికొత్త నడక నేర్పారని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో జీవనది గోదావరి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నదని ఆమె పేర్కొన్నారు.
‘మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి జలాలను ఎత్తిపోసి సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ జలాశయానికి తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. వైభవం కోల్పోయిన నిజాం సాగర్ ప్రాజెక్టుకు జలకళను తీసుకురావడం శుభపరిణామం.
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి హల్దీ వాగు ద్వారా మంజీరా నదిలోకి కాళేశ్వరం జలాలను తీసుకురావడం అద్భుతం.
మంజీరా నదిలోకి వచ్చే కాళేశ్వరం జలాలు నేరుగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరనుండటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసులకు ఎంతో ఉపయుక్తం.
మంజీరా నదిపై ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలు ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టడంతో నిజాంసాగర్ బోసిపోతున్నది.
వానాకాలంలోనూ నీరు లేక కళావిహీనంగా మారుతున్నది. ఈ పరిస్థితిలో కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తరలించడంతో పాత ఆయకట్టు స్థిరీకరణ జరిగి రైతులకు మేలు జరుగుతుంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులు రెండు పంటలు సాగు చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి