ఖమ్మం, మార్చి 31: జిల్లాలో శుక్రవారం ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏఎస్పీ స్నేహమెహ్రా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇతర పోలీసు అధికారులతో కలిసి పర్యటించారు. పటేల్ స్టేడియంలో హెలీప్యాడ్, నూతన బస్టాండ్, బహిరంగ సభ ప్రదేశం, వైకుంఠధామం, శ్రీశ్రీ సర్కిల్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు ఏప్రిల్ 2న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్లు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సూచనల మేరకు ఏఎస్పీ స్నేహామెహ్రా ఆధ్వర్యంలో ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, టౌన్ ఏసీపీ ఆంజనేయులు, ట్రాఫిక్ ఏసీపీ రమేశ్, సీఐలు చిట్టిబాబు, తుమ్మ గోపి, శ్రీధర్, సురేశ్, కరుణాకర్ బుధవారం నగరంలో పర్యటించారు. వీఐపీలు పర్యటించే ప్రాంతాలను సందర్శించారు. నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం, ఐటీ హబ్ సెకండ్ ఫేజ్ శంకుస్థాపన, మున్సిపల్ కార్పొరేషన్లో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులు, శ్రీశ్రీ సర్కిల్ నుంచి నిర్మించనున్న నాలుగు లైన్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, డబుల్బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం, వైకుంఠధామం ప్రారంభోత్సవం చేసే ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.